పుట:Vavilala Somayajulu Sahityam-4 Vyasalu.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వయస్సు 21 సంవత్సరాలకు తగ్గించి, బాలికలకు 15, 16 సంవత్సరాలకు పూర్వం సంతానం కలగటం ప్రారంభిస్తే, తల్లికి బిడ్డలకీ ప్రమాదమన్నాడు.

సుశ్రుతాచార్యుల మతాన్ని అనుసరించి స్త్రీజాతి ఋతుధర్మం 12వ ఏట ప్రారంభించి 50 సంవత్సరాలవరకూ ఉంటుంది. 15 మొదలు 45 ఏళ్ళవరకూ సామాన్యంగా సంతానాన్ని పొందవచ్చును. ఆ నాటి భారతీయుని విద్యాభ్యాసానికి 25 సంవత్సరాలు పట్టి ఉండటం వల్ల పురుషుని వైవాహిక వయస్సు 25 అని ఆయన చెప్పి ఉంటాడు. పూర్ణ పురుషాయుష జీవితాన్ని మూడు విభాగాలు చేస్తే 32 సంవత్సరాలు వస్తుంది. సన్యాసాశ్రమము లేకపోతే బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థాలు ఒక్కొక్కదానికి 32 సంవత్సరాలనీ, నాలుగు ఆశ్రమాలు ఉన్నప్పుడు ఒక్కొక్కదానికి వయస్సు 25 సంవత్సరాలనీ సుశ్రుతాచార్యులు భావించి ఉండవచ్చునని ఒక ఆధునిక వైద్య శాస్త్రజ్ఞుని అభిప్రాయం.

స్త్రీ పురుషుల మధ్య వైవాహిక వయస్సులో అంతరం ఎంత ఉండవలెననేది మరొక సమస్య. వీరి ఇరువురి మధ్య ఉండే అంతరాన్ని బట్టి కూడా కలిగే సంతానము, సౌఖ్యకరమైన జీవనమూ ఆధారపడి ఉంటాయి. ప్రపంచంలో సర్వసామాన్యంగా అనేక జాతుల్లో పురుషుని కంటె వధువు వయస్సు తక్కువగా ఉంటుంది. ఎక్కడైనా వరునికంటే వధువు వయస్సు అధికంగా ఉంటే దానికి ప్రత్యేకమైన కారణాలు ఉండవచ్చును. అన్న చనిపోయినప్పుడు అన్నభార్యను విధిగా వివాహమాడవలసిన సందర్భాలలో తప్పకుండా వధువు వయస్సులో వరుని మించి ఉంటుంది. ఆధునిక యుగంలోని ప్రణయ వివాహాలల్లో కొన్ని సందర్భాలలో కూడా వరుని కంటే వధువు వయస్సు పెద్దదిగా ఉండవచ్చును. సర్వసామాన్యంగా అటువంటి సందర్భాలలో కూడా విజ్ఞులు దానికి ఏదో మానసిక దౌర్బల్య సంబంధమైన మూలకారణాన్ని చెప్పుతున్నారు. ఏ దేశంలోనైనా వరుడు తప్పకుండా తనకంటే వయస్సున కొంత తక్కువగా ఉన్న దానినే వివాహం చేసుకోటం ఆచారంగా ఉంటుంది. సుశ్రుతాచార్యుల మతాన్ని అనుసరించి స్త్రీలలో ఋతుధర్మం 15 సంవత్సరము మొదలు 45 వరకూ ఉంటుంది. కాబట్టి వారి ఇరువురి మధ్యా సౌఖ్యకరమైన జీవనమూ, సంతానమూ కలుగవలెనంటే 15 సంవత్సరాల అంతరం ఉండితీరవలెనని అవగతమౌతున్నది. మనువు కూడా ముప్పదిసంవత్సరాల యువకుడు పన్నెండు సంవత్సరాల కన్యకను వివాహమాడ వలసిందని అన్నాడు. (9-24) అంటే ఆయన మతాన కూడా 18 సంవత్సరాల అంతరం ఉన్నదన్నమట. నేడు భారతదేశంలో జరుగుతున్న వివాహాల్లో వధూవరుల


సంస్కృతి

255