Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/516

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చెప్పుకున్నాడు. పద్మావతీదేవి ఆయన భార్య అనీ, దేవదాసి అనీ భిన్నాభిప్రాయాలున్నవి. ఇందులో ప్రథమాభిప్రాయాన్నే పండిత లోకం అంగీకరించింది. బహుకాలం సంతానం లేక ఒక బ్రాహ్మణుడు జగన్నాథస్వామి నారాధించి ఒక పుత్రికారత్నాన్ని పొంది ఆమెకు పద్మావతి అని నామకరణం చేసి మహా విష్ణువుకు తప్ప నన్యుల కామె నీయనని నిశ్చయం చేసుకున్నాడట. ఆమెకు యుక్తవయసు వచ్చిన తరువాత పుత్రికను వెంటతీసుకుని ఆమెను దేవదాసిగా స్వామిపేర విడిచిపెట్టటానికి పురుషోత్తమ క్షేత్రానికి వెడుతుండగా జగన్నాథస్వామి సాక్షాత్కారించి 'ఓ భక్తశ్రేష్టుడా! నా కర్పింపదలచిన యీకన్యకను నా అంతరంగ భక్తుడైన జయదేవుడి కర్పించు. అదే నా కమితానంద మని పలికినాడట! అప్పుడు పరివ్రాజక శ్రేష్ఠుడుగా ఉన్న జయదేవుడామెను స్వీకరింప నిరాకరింపగా తండ్రి 'ఇది భగవదాజ్ఞ' యని పుత్రిక నట నుంచి పోగా జయదేవు డామె శుశ్రూషను స్వీకరించి క్రమముగ స్నేహ భావము పెంపొందిన పిమ్మట వివాహమాడి నటుల 'భక్తమాల' వల్ల తెలుస్తున్నది.

జయదేవుడు ఉపాస్యదేవత అయిన నారాయణమూర్తి కైంకర్యం కోసం ధనార్జన చేయటానికి బృందావనం, జయపురం మొదలయిన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వస్తుండగా దారిలో చోరులు ఆయన ధనాన్ని అపహరించి కాళ్ళూచేతులు విరుగగొట్టి పోయినారట! ఒక ప్రభువు వేటకు వచ్చి ఆయన దుర్దశను జూచి రాజధానికి తీసుకొనిపోయి చికిత్స చేయించి స్వాస్థ్యం చేకూర్చిన తరువాత పద్మావతితో ఆ కవి అక్కడనే కాపురం చేస్తూ ఉన్నాడు. యతి వేషాలు వేసుకొని వెనుకటి చోరులు ఆ రాజధానికి వచ్చినా తెలుసుకొని కూడా వారికి జయదేవుడు శిక్షచెప్పింపలేదట! [1]

జయదేవస్వామిగా వేదవ్యాసులే నిజాంశతో తిందుబిల్వ గ్రామమున జనించినారని యొక ప్రతీతి యున్నది. జయదేవుడు పదునెనిమిది క్రోసుల దూరంలో ఉన్న గంగానదికి నిత్యమూ స్నానానికి వెళ్ళి వచ్చేటవాడట. గంగాదేవి ఆయన కష్టాన్ని

జూచి ఓర్చలేక ప్రసన్నరాలై “ఒకమాట, నీవు నిత్యమూ నా దగ్గరకు రాలేవు. నేనే నీ

  1. "శిష్యునిపైగల వాత్సల్యంతో అతని దేశానికి వెళ్ళి వచ్చేటప్పుడు ఆ శ్రేష్ఠి శిఖామణి స్వామికి తెలియకుండా పల్లకీలో దాచిఉంచిన ధనాన్ని బోయీలే అపహరించి జయదేవుని కాలుచేతులు విరుగగొట్టి యరణ్య మధ్యమున విడిచి పారిపోయినట్లు మరియొక కథ” గీత గోవిందము - పీఠిక : ఎ.వి. నరసింహ పంతులు పే. 12 (M. Adhi & Co. Madras-Publication 1911)

516

వావిలాల సోమయాజులు సాహిత్యం-2