Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-2 Natakalu.pdf/354

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాచమ్మ : ఏమో! నాయనా, చెప్పుల్లో కాళ్లు పెట్టుకొని వచ్చాడు. వెళ్లక తప్పదట.

మల్లన్న : వెళ్లక తప్పదూ? ఎందుకు తప్పదో చూతాం. ఉత్సవాలెప్పుడో ఇంకా మాసం పై చిలుకుంటే వీరంతా ఎంత కార్య నిర్వాహకులైనా ఇప్పటినుంచే ఏం చేస్తారేం. ఆయన ఉండదలచుకోక ఇదొక సాకుచెప్పుతున్నాడు గాని.

శ్రీనాథుడు : కాదులే మల్లన్నా, నన్ను బలవంతం చెయ్యవద్దు. నేను ఒక్కణ్ణేకాదు, తిప్పయ్యసెట్టి కూడా బయలుదేరి వచ్చాడు. అతడు నాకంటే ముందే రాచకొండ చేరుకుంటాడు.

మాచమ్మ : అబ్బాయీ! తిప్పయసెట్టి అంటే నీకు తెలుసునా మామకు చిన్నప్పటి నుంచీ స్నేహితుడు. గొప్ప శ్రీమంతుడు.

మల్లన్న : మనిషినైతే చూడలేదుగాని తిప్పయ్య పేరు వినకపోవటమేం. తిరగటి కల్లులాగా దేశదేశాలూ తిరిగి కర్పూరం, చందనం, పునుగు జవ్వాజి అదే పేర్లతో రాజుల నందరినీ దోచుకుంటుంటాడు. ఆ రాజులు మనబోటి కర్షకులను దోచుకుంటుంటారు.

శ్రీనాథుడు : మల్లన్నా! అది దోపిడీ ఏమిటి, వ్యాపారానికి లక్షణం. వాళ్ళు ధనవంతులు కాక పోతే దేశానికి వస్తు సంభారాలు వచ్చే వీలేలేదు. రాజులు ప్రజల మీద పన్నులు వేసి గ్రహించక పోతే పరిపాలనే లేకుండా అరాజకమైపోతుంది దేశం.

మాచమ్మ : మల్లన్నా! ఎలాగైన మామను ఇవాళ పోనీయకుండా ఆపే భారం నీది.

శ్రీనాథుడు : అక్కయ్యా! ఎందుకీ నిష్ఠూరం వృథాగా! రానా పోనా?

మల్లన్న : అమ్మా! ఎలా పోతాడో చూస్తాను. నేను పొలం పని మానుకుంటాను. పోనీ రేపౌతుంది. నీవు త్వరగా గంగకు వెళ్ళి రాపో మడికట్టు కుందువుగాని.

మాచమ్మ : అబ్బాయీ, పొద్దున్నే మీ నాన్న పోతవరం వెళ్లారు. ఆయన వచ్చేలోపల మామయ్యకు మీ నాన్నగారు వ్రాసిన కవిత్వం వినిపించు తప్పులుంటే దిద్ది సరిచేస్తాడు.

(బిందెతో గంగకు బయలుదేరుతుంది)

శ్రీనాథుడు : మల్లన్నా! అనవసరంగా ఇక్కడ నేను ఆగిపోటమూ, అక్కడ మానెత్తిన తలకు మించిన బరువు కాచుకో కూర్చోటమూ.

మల్లన్న : కొంత కాలంనుంచి మా నాన్నగారు భాగవతము ఆంధ్రీకరిస్తున్నారు. అది నీవు వినకుండా పోవటానికి వీలులేదు.


354

వావిలాల సోమయాజులు సాహిత్యం-2