పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నీరాజనం


నన్ను చూచిన మా బావకు మోము తెల్ల పోయింది. అది నేను మాత్రం గ్రహించాను. మా బావ దేహవర్ణం నా చాయకన్న రెండు డిగ్రీలు తక్కువ, కాసుబంగారం ఛాయ అనవచ్చును. నా చాయ బాగా పండిన దబ్బపండు చాయలో గులాబిపూవు చాయ కలిపినట్లుంటుంది. అలాంటి అతని మోము చాయ ఒక్కసారి తెల్లబడిపోయింది. ఇంతట్లో అతడేధో గంభీర మౌనముద్ర వహించినాడు.

   రాత్రి మేమందరం కలిసి భోజనాలు చేశాము. నాకు మా బావ వెండి కంచం పక్కనే వెండి కంచం వేశారు. మా కొంటె వదినలు చేసినపనది సుబ్రహ్మణ్యం అన్న ఎదురుగుండా కూర్చుంటే, అతని పక్క అతని భార్య కూచుంది. వెంకటరంగమ్మ అలివేలు వదినలూ, సరోజినీ పిల్లల కోళ్ళులా తమ చిన్న బిడ్డలను చుట్టూ పెట్టుకొని కూర్చున్నారు. పెద్దపిల్లలు విడివిడిగా కూర్చున్నారు.
   మా బావ కొల్లిపర వస్తూనే మనుష్యులను పంపి తన అక్కలను, సుబ్రహ్మణ్యంగారినీ, అతని భార్యనూ రప్పించాడట. మేము సాయంకాలానీకి వస్తామనగా ఆ ఉదయమే సుబ్రహ్మణ్యమూ, అలివేలు వదినగారూ, పది పదకొండు గంటలకు వెంకటరంగమ్మ వదినగారున్నూ వచ్చారు.
   మా బావ పక్కనే కూరుచుండి కిక్కురుమనకుండా భోజనం చేశాను. ఎందుకాతని మోము తెల్లబోయింది? అతడు నేనంటే అనుమానిస్తున్నాడా? నా భోజనం అంత సయించలేదు. మా బావ చల్లగా భోజనం చేశాడు. మా అలివేలు వదిన ఒకటే వాగుడు. నన్ను లక్షా వేళాకోళాలతో ముంచింది. నేను నవ్వు మాత్రంతో భోజనం ముగించాను. భోజనంచేసి మందువా ముందు ఆరుబైట సావడిలో కుర్చీలలో కూర్చుని తాంబూలాలు వేసుకుంటున్నాము.
   మా బావ నావైపు చూచి, "హేమా! నిశాపతి వచ్చాడా?" అని అడిగాడు.
   ఆ ప్రశ్న నాలోని బిడియాన్నీ, కుములుకుంటున్న దుఃఖాన్నీ మాయం చేసింది.
   "నిన్న సాయంకాలానికి వచ్చాడు బావా! లోకేస్వరీ, నిశాపతుల ఆనందం వర్ణనాతీతం!"
   "కాదామరి! వివాహముహూర్తం ఎప్పుడు?"
   "వైశాఖశుద్దమందట. నేను పూర్తిగా తెలుసుకోలేదు."
   మా బావ తాంబూలం వేసుకొని, లేచి నెమ్మదిగా వీధిలోకి జారాడు.