ఈ పుటను అచ్చుదిద్దలేదు
స్త్రీయే కావ్యాలు అల్లడం ప్రారంభిస్తే, ప్రతి సమస్యకూ తమ నాయికను చేసుకొని, తన హృదయంలో వున్న ఆశయ పురుషుణ్ని నాయకుణ్ని చేస్తుంది. 'సోఫో' కవయిత్రిని చూడు, తరిగొండ వెంకమాంబను, మీరా బాయిని చూడరాదూ!
అందరు స్త్రీ కవయిత్రులు నువ్వన్నట్లు చేయరు బావా! ప్రసిద్ది కెక్కిన పెరల్ బక్కు ' గుడ్ ఎర్తు ' ను రాసింది. ఆమె నాయకుడి గాథను రాసింది. నాయికలు ఇద్దరయ్యారు. ఆ కథ పెరల్ బక్కూ రాయవచ్చును. లేదా సింక్లెయరు లూయీ రాసినా రాయవచ్చును. 9
ఫిబ్రవరిలో రాత్రిళ్ళు చలిపూర్తిగా తగ్గదని, శ్రీనాథమూర్తి కారు ఎక్కేటప్పుడే ఒక చిన్న శాలువ తీసుకువచ్చాడు. సముద్రంలో వారు కారులోంచి దిగగానే, హేమ చుట్టూ ఆ శాలువ కప్పాడు మూర్తి.
హేమ పక పక నవ్వి అప్పుడే ఉదయించు చంద్రుణ్ని చూస్తూ, నువ్వూ, నేనూ, చంద్రుడూ, సముద్రమూ, నిశ్చలతా, చలీ, ఈ చక్కటి రాత్రీ! ఏదో సినిమాలో దృశ్యంలా ఉంది అన్నది.
విషాదగర్భితమైన చిరునవ్వు నవ్వుతూ త్యాగతి, సముద్రతరంగాలలో స్నానం పూర్తికావించి పైకి తేలిపోయే చంద్రుణ్ణి చూచాడు.
ఏమోయీ బావా! ఆ చంద్రుడూ, నువ్వూ ఒకే విధంగా వున్నట్టే కనబడతారేమిటి నాకు! అని హేమ ఇంకా నవ్వుతూ ముందుకు నడిచింది.
ఎన్ని నక్షత్రకాంతులున్నా, అతడు ఎప్పుడూ ఒంటిగా ఉంటాడనా?
మాట్లాడితే నీకు పురుషులు స్త్రీలై తోస్తున్నారేమిటి బావా? నీకు తారలే కావలిస్తే, ఈ ఊరునిండా సినిమా తారలే!
నేను ఎప్పుడూ ఒంటివాడినే హేమా!
జంట దొరకని మహాప్రళయపుటింటిలో ఒంటిగా ఉయ్యాలలూగే వాడవా?
బసవరాజు అప్పారావుగారి ఆ పాట ఎంతో అందంగా వుంది కదా హేమా?
నాకు పిగ్మిలియాన్ కథ ఎదుటగా ఆడుతూనే వుంది బావా! బసవరాజువారి పాటమీదకు పోవటం లేదు.
మగవాళ్ళ అన్యాయం తలుచుకుంటూ, మండిపడి పోతున్నావు కాబోలు?
ఆ! నేనే పిగ్మిలియాను అవుదామని ఉంది. ఏబోయినోచేత పుచ్చుకొని, వాడికి సంపూర్ణ సంస్కారమిచ్చి, కులం, సంప్రదాయం, పుట్టుక, గొప్పదనం అనీ, హుళక్కి అని చూపించదలచుకొన్నాను.
వాళ్ళిద్దరూ సముద్రపు అలలకు కొంచెం దూరంలో, ఇసుక ఒడ్డున కూర్చున్నారు. త్యాగతి పక్కగా చేరింది హేమ.