ఈ పుటను అచ్చుదిద్దలేదు
లల్లో వున్న ఆడవాళ్ళే నయమేమో! నలుగురు బిడ్డల తల్లులు కాగానే అందాల ఊర్వశిలా కనబడాలన్న వాంఛ చంపేసుకుంటారు. బడాయికి మాత్రం చీరలూ, నగలూ కావాలంటారు. తనతల్లి సంగతి చుస్తే అచ్చంగా పేదరాసి పెద్దమ్మలా వుంటుంది. తన అక్క అత్తగారు జుట్టంతా తీయించుకొని సన్యాసిలా లేదా! ఈ ఆలోచనలతో హేమ తల తిరిగిపోయింది. సరే ఇంతకూ త్యాగతి....కాదు....మూర్తి....బావ విషయంలో తన ధర్మం ఏమిటి?
2
శ్రీనాథమూర్తి తన చరిత్ర లోకేశ్వరి చేతుల్లో పెట్టి, హేమకిమ్మని చెప్పిన తర్వాత మూడురోజులు వరకూ మామగారింటికి రాలేదు. రోజూ వచ్చే మూర్తి మూడురోజులు ఎందుకు రాలేదా అని, వినాయకరావుగారు. కారుమీద త్యాగరాజ నగరంలో సైదాపేట దరిదాపుగా వున్న శ్రీనాథమూర్తి ఇంటికి వెళ్ళారు. శ్రీనాథమూర్తి ఒక చిన్న మేడ కొనుక్కున్నాడు ఆ మేడ పక్క వేరే ఖాళీస్థలమూ కొనుక్కున్నాడు. ఆ స్థలంలో శిల్పగృహ మొకటి కట్టించుకొన్నాడు. ఇదివరకే మూర్తి ఇంటికి పది పదిహేను సారులు వినాయకరావుగారూ, వెంకటరావమ్మగారూ వచ్చారు. మూర్తి కట్టించే శిల్పగృహము అప్పుడప్పుడు పర్యవేక్షణ చేస్తూ వుండేవారు వినాయకరావుగారు.
ఆయన కారువచ్చి గుమ్మం దగ్గర నిలవగానే త్యాగతి శర్వరీభూషనుడైన శ్రీనాథమూర్తి లోపలనుండి వెంటనే బయటకువచ్చి, మామగారిని ఆహ్వానించి, లోపలి తీసుకొనివెళ్ళి, తన అతిథి మందిరంలో కూర్చుండబెట్టాడు. ఆ అతిథిమందిరం ఎంతో అందంగా వుంది. అందులో ఒక సోఫాగాని, కుర్చీగాని లేదు. అడుగు ఎత్తు కోళ్ళున్న పెద్దబల్లలూ, ఆ బల్లలపై చక్కని బందరు జాతీయ కళాశాల రత్నకంబళ్ళూ, తివాచీల రంగులకూ, లతలకూ శ్రుతికలిపే అందమైన రంగులూ, లతలూ వున్న పట్టు దిండూ వున్నాయి. లలితంగా నీలవర్ణం పూయబడి వున్నవి. గోడలు. నాలుగు గోడలకూ నాలుగు పెద్దవి కైలాసశిఖర చిత్రలేఖనాలు వున్నవి. బల్లలకు ఎదురుగా అక్కడక్కడ లతలు చెక్కిన మూడుకొళ్ళ పీఠములు, వానిపైన ఆంధ్ర, హిందూ మొదలయిన దినపత్రికలు. భారతి, మోడరన్ రివ్యూ మొదలయిన మాసపత్రికలు, కృష్ణా, సండే టైమ్సు మొదలైనవార పత్రికలు చక్కగా అమరింపబడి వున్నవి. నాలుగు మూలల నల్లచేవ కఱ్ఱల అలంకారశిల్ప విన్యాసయుక్త పీఠికలపై మూర్తి రచించిన మూడడుగుల ఎత్తు రాతి విగ్రహాలు, తాండవకృష్ణుడు, నటేశ్వరుడు, నృత్యసరస్వతి, రంభా నాట్యము విగ్రహాలున్నాయి.
నాయనా, ఈ మూడురోజులు ఎందుకు మా యింటికిరాలేదోయి అని వినాయకరావుగారు శ్రీనాథమూర్తిని ప్రశ్నించారు.