ఈ పుటను అచ్చుదిద్దలేదు
అంగకరవాసంలోను క్ష్మేరశిల్పం, వాస్తుసంపద ఉత్తమంగా ఉంది. ఈ గుళ్ళ ఆవరణ 6080 చదరపు గజాలుంటది. ఆవరణ చుట్టూ లోతయిన అగడ్త వుంది. ఇదీ బ్రహ్మగుడే. ఇక్కడా బౌద్దమతం ప్రవేశించింది. కాంభోజ భాషలో సంస్కృతభాష మిళితమైపోయింది. కాంభోజ దేశాన్నుంచి సయాము దేశమూ ప్రవేశించింది రాజులు పేరులు సంస్కృతపు పేరులే! ఈ గుళ్ళలో నాగము మహోన్నత రూపంపొంది అద్భుత సాక్షాత్కార మిస్తుంది. పదిహేనురోజులుండి, ఆ విగ్రహాల చిత్రాలన్నీ గీచుకొని, ఓడ ఎక్కి మన దేశం చేరుకున్నాను. నా జావాయాత్ర, కాంభోజ యాత్రలు ఎప్పటికీ మరచిపోలేను.
మా అమ్మగారిని భట్టిప్రోలునుంచి తీసుకుని హరిద్వారం చేరి, ఒక్కొక్కశిల్పం సంప్రదాయం రీతిగా, నేపాలు, టిబెట్టు, బర్మా, జావా, బలి, కాంభోజ శిల్పాలు పంచలోహాలతో అడుగు ఎత్తున పోతపోశాను. విల్హె ల్మినా కన్య, సుశీలాదేవి నా శకుంతలలోని అంతర్భాగంలా అనుకున్నాను. కాలం కర్కశ వక్రాలకు శ్రుతిరూపం కల్పించి, సౌందర్యమే మన స్మృతికి తీసుకువస్తూ వుంటుంది. మనుష్యుడు పశువైననాడు కర్కశుడు: అతడు మనుష్యుడైననాడు శ్రుతిరూపం పొందుతాడు. దివ్యుడైననాడు సుందరమూర్తే అవుతాడు. దివ్యుడంటే భగవంతుడని నా ఉద్దేశం కాదు. దేవత అవుతాడనీ కాదు మహోత్తమ మనుష్యుడు అవుతాడని. లోకం అంతా ఉత్తమస్థితిలో వుండాలనీ, సర్వసమత్వం కావాలనీ ఎంచేవాడే ఉత్తమ మనుష్యుడని నా ఉద్దేశం. కాని ఆ కోర్కెలన్నీ చంపుకొని నేను తంతి ఇవ్వడంవల్ల నన్ను సింగపూరులో కలుసుకొన్న విల్హె ల్మినా, డిజాంగులనూ, విల్హె ల్మినా భర్తనూ చూచినాను. విల్హె ల్మినా నాకు నమస్కరించి శర్వరీభూషణ్, నీ స్నేహంవల్ల నా శిల్పానికీ, చిత్రలేఖనానికి ఏదో మహత్తర సౌందర్యం వచ్చిందనే డచ్చి విమర్శకులు ప్రశంసిస్తున్నారు. నీ గురుత్వం ఎప్పుడూ మరచిపోలేను. నిజమైన జావాతనం నా శిల్ప చిత్రాలలో వెళ్ళివిరిసి పోతున్నదట! అని కంట ఆనందభాష్పాలు కమ్ముతుండగా పలికింది. ఆమె రచనలన్నీ నాకు చూపించింది. నన్ను బటేవియా వచ్చి తమ ఇంట్లో వుంచమన్నది. ఆమె భర్త కూడా నన్నెంతో ప్రార్థించాడు. కాని నాదేశం మీద మనస్సు ప్రవర్తిస్తున్న నాకు మా అమ్మా, నా దేశమూ, నా గురువూ ఎదుట కనబడుతూ వుండడంవల్ల వారి కోర్కె పాలింపలేకపోయాను. వారందరు గాఢ ప్రేమ పూర్వకంగా నాకు వీడ్కోలిచ్చారు. మా ఓడ సాగింది.
ఆ రాత్రి ఓడ సైకట్టుమీద అడ్డకడ్డీల నానుకొని ఆశ్వయుజ శరత్కాలపు వెన్నెల కెరటాలను, దూరాలను ముత్యాల కాంతిలో తేల్చి ఆడిస్తుండగా నా చరిత్ర అంతా తలుచుకుంటూ నిలుచున్నాను.