ఒకేసారి నలుగురు అర్హులవడం ధర్మవిరుద్దం. ఏ ధర్మమూ అలా భోధించదు.
సనక సనందనాదు లందరూ ఒకేసారి ముముక్షువులు కాలేదా ?
సనక సనందనాదులు భక్తిభావం యొక్క అనేకత్త్వాన్ని మాత్రమే తెలియచేస్తున్నారు. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క భక్తుడే భగవంతునిలో లీనమయ్యాడు. నరసింహమూర్తికి ప్రహ్లాదుడు, వామనునకు బలి, రామునకు హనుమంతుడు, కృష్ఠునకు అర్జునుడు.
ఆయన మాటలు నన్ను దాటిపోతున్నవి. నదిలో ప్రతిఫలించే చంద్రుని నవ్వులు నిశ్శబ్దంతో దిశలను ఆవరిస్తున్నవి. మందమలయానిలుడు మాఘమాసపు లే చివుళ్ళ సౌరభాలను పన్నీరు చల్లుతున్నాడు. శిశిరాకాశ నైర్మల్యము చేతులుచాచి తన నీలి హృదయానికి సర్వప్రకృతిని అదుముకొంటున్నది. సర్వవర్ణాలలోని స్పష్టతా కరిగిపోయి యేకవర్ణములో కలసి పోతున్నది. త్యాగతి విశాలఫాలంలో పూర్ణకౌముది వల్ల అణగిపోయిన తారకా కాంతులన్నీ పుంజీభవించినవి. అప్పుడాతడు లో గొంతుకతో.
గాలై ప్రసరిస్తే
వాగై ప్రవహిస్తే
మలయపవనమై
మందాకినివై
రారా నా రాజా !
యీ రాజ్యంలో
నే నొంటినిరా!
కాంతై జ్వలియిస్తే
శాంతై పులకిస్తే
శరత్సుషమయై
క్షపాహాసమై
రారా నా రాజా !
యీ రాజ్యంలో
నే నొంటినిరా !
అని పాడినాడు.
ఎవరిదయ్యా యీ పాట ?
నేనే రచించుకొన్న గీతిక యిది.
ఏమయ్యా! నీవున్నూ తీర్ధమిత్రునిలా కవిలాగున్నావే !
నేనే కవి నెట్లా ? నా గొంతుక అవ్యక్తం, అస్పష్టం. ఏవో సంద్యా భావాలున్నవి. తీర్ధమిత్రుడంటావా, స్పష్టతతాల్చిన జ్వాలా శిఖవలె ప్రజ్వరిల్లుతూ ఉంటాడు.
పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/20
ఈ పుటను అచ్చుదిద్దలేదు