ఈ పుటను అచ్చుదిద్దలేదు
అయితే మీ దేశం మళ్ళా రమ్మంటావా?
తప్పకుండా, ఈ పట్టు స్వయంగా నేను మీ కుటుంబానికి దర్శకుణ్నయి, నా దేశం చూపిస్తాను.
కృతజ్ఞులము. ఓహో! ఆ పవిత్ర దినం కోసం ఎదురుచూస్తూ వుంటాను.
డిజాంగ్ : మా అమ్మాయికి పెళ్లికాగానే, దంపతులిద్దరూ హనీమూన్ మీ దేశంలోనే గడుపుతారు.
తండ్రి మాటలకు విల్హె ల్మినా సిగ్గుపడింది.
నేను బటేవియా ఓడ ఎక్కి చక్కని ఓడ ప్రయాణం చేస్తూ, సైగాను పట్టణంలో దిగాను. అచట మూడురోజులునుండి డిజాంగ్ గారి ఉత్తరాలతో వారి స్నేహితులైన కొందరు ఫ్రెంచి అధికారులను కలుసుకొన్నాను. నాకు ఫ్రెంచి రాదు. కాని ఒక తెలుగు అరవ మద్రాసీ సోదరుడు వీరి కచ్చేరీలో గుమాస్తాగా వున్నారు. ఆయన మా ఇద్దరిమధ్యా దుబాసీ అయ్యాడు.
సైగానులో చాలామంది తెలుగువారు, ఎక్కువమంది అరవవారూ ఉన్నారు. సైగానునుంచి బయలుదేరి టోన్లేసావ్ చేరుకున్నాను. టోన్లేసావ్ పెద్ద మంచినీళ్ళ చెరువు. దానిలో సయిమ్ రీవ్ అనే నది పడుతుంది. సయిమ్ రీవ్ నదీ సరస్సు ఒడ్డున ఈవలావల అంగోర్ వాట్, అంగోర్ ధామ్ లనే శిల్ప క్షేత్రాలున్నాయి. ఆ ప్రదేశాలన్నీ చూచి, ఓడెక్కి ఇండియా చేరి హరిద్వారం వచ్చాను. ఆరు నెలలు ఏకదీక్షతో పనిచేసి, నేను తల పెట్టిన పన్నెండు పంచలోహ ప్రతిమలు తయారుచేశాను. ఈ పనికి సహాయం కాశీనుంచి ఒక మంచి లోహకారుని రప్పించాను. విగ్రహాలు చాలా బాగున్నాయని స్వామీజీ ఎంతో ప్రశంసించారు. ఆ పన్నెండు విగ్రహాలున్నూ; బర్మా, జావా. బలి, కాంభోజ దేశాలలో నేను రచించి సంపూర్ణం చేసిన చిత్రాలు నలభై ఎనిమిదిన్నీ 1935 ఫిబ్రవరి నెలలో ఢిల్లీలో ప్రదర్శించాను. ఆ ప్రదర్శనం కూడా చాలా జయప్రదంగా జరిగింది. బొమ్మలు ఎన్నో ఖర్చైపోయినవి. ఒక మహారాజు త్యాగతీ మందిరమని తన విశాల భవన మాలికతో ఒకటి ఏర్పాటుచేసి, నా చిత్రాలు ఒకేసారి ఇరవై కొన్నారు. విగ్రహాలలో ఎనిమిది కొన్నారు. ఈ అమ్మకంవల్ల నాకు ఆరువేల ఎనిమిది వందల రూపాయలు వచ్చాయి.
స్వామీజీ నన్ను చూచి నాయనా! నీ శిల్పవిద్యాభ్యాసం పూర్తి కావాలంటే నువ్వు చీనా, జపాను, అమెరికా, యూరపు, ఈజిప్టు పర్షియాలు కూడా తిరిగి రావాలి సుమా అన్నారు.
స్వామీ! మన సంప్రదాయాలకు పూర్తిగా వ్యతిరేకమయిన పాశ్చాత్య దేశాలకు పోవడం నాకంత ఇష్టం లేదండీ.
ఓయి వెఱ్ఱిశిల్పీ! పాశ్చాత్యులు మనుష్యులుకారా! ఏ మహత్తర శక్తివల్ల భారతీయులు ఉద్భవించారో, ఆ మహత్తర శక్తివల్లనే సర్వ మానవ ప్రపంచమూ ఉద్భవించింది. అందరికీ పశుధర్మము సమానం. మానవ ధర్మమైన