అవునండీ, నేను భారతీయుణ్ణి. శిల్ప విద్యార్థిని. ఆంధ్రుణ్ణి. ఆంధ్రదేశం, మదరాసుకు ఉత్తరంగా ఆరువందల మైళ్ళు పొడుగు, మూడు వందల వెడల్పున్న భూమి. అక్కడి శిల్పచరిత్ర తూర్పు ప్రపంచానికంతకూ దేశికత్వం వహించింది. అందులో ఒక చిన్న ఖండమే ఈ శిల్పము అని అన్నాను.
ఆనందం. నేనూ, నా కొమార్తె ఈ బాలికా శిల్పులమే. మేము మీ భరతదేశం యావత్తూ తిరిగి వచ్చాము. ఈ బాలిక విల్హె ల్మినా. నాపేరు డిజాంగ్. ఈ బాలిక తల్లి హెర్ ఫాన్ వాగేనార్ గారి కుమార్తె. వాగేనార్ ఈ దేశంలో ఒక రాజు. ఆయన ఒక జావారాజు తనయను పెళ్లి చేసుకొని , ఆ అమ్మాయి ఆ రాజుకు ఒక్క సంతానమే అవడంచేత, తానే జమీందారుడయ్యాడు. ఇదీ మా చరిత్ర. పొద్దుటినుంచీ ఇక్కడే వుండి, ఈ బొమ్మల ప్రతిరూపాలు లింఖించుకుంటోంటే చూచి, మీ రెవరో తెలుసుకొని, మీకు సహాయం చేయాలని మా అమ్మాయి నన్ను వేపుకుతింది, మీ చిత్రాలు మేము చూడవచ్చునా?
చిత్తం!
నా చిత్తుచిత్రాల పుస్తకాలు వారికిచ్చాను. ఆ బొమ్మలన్నీ కొన్ని వందలుంటాయి. తండ్రీ కూతుళ్లిద్దరూ ఒక అరగంట చూశారు. ఆయన నా మొగంవైపు చూడగానే అయ్యా, నా పేరు త్యాగతి శర్వరీభూషణ్ అన్నాను.
అయ్యా భూషణ్ గారూ! మీ బొమ్మలన్నీ ఇప్పుడు చూడలేము. ఇక్కడ బంగాళాలో మా నివాసం. మీరు ఇక్కడ వుండదలచుకొన్నన్ని రోజులు మా ఆతిథ్యం స్వీకరింప ప్రార్థన. మీరు మాతో వున్నప్పుడు సావకాశంగా ఈ బొమ్మలన్నీ చూస్తామండీ అని ఆయన నన్ను వేడుకొన్నాడు.
నేను వారితో బంగాళాకు వెళ్ళాను. నా సామానూ బంగాళాలోనేవుంది. అయితే నా స్వంతవంట మాని వానితో నాకై తయారుచేయించిన శాకాహారం మాత్రం తీసుకుంటూ వారికి అతిథినయ్యాను.
విల్హె ల్మినా బటేనియా కాలేజీలో చదువుకుంది. శిల్పంలో ఎక్కువ ఇష్టం వుండడం చేత బటేనియా శిల్పవిద్యాలయంలో శిక్షణ అలవరించుకుంది. ఆమె హాలెండు, యూరపు, ఇంగ్లాండు, ఇండియా, బర్మా, చీనా, జపాను, ఆంగకర్ వాటు మొదలయిన ప్రదేశాలన్నీ తండ్రితో కలిసి మూడేళ్ళు యాత్ర చేసింది. విల్హె ల్మినా లిఖించిన చిత్రాలన్నీ చూచినాను. డిజాంగ్ గారు నన్ను వారి శిల్పాలను చూచుటకు బటేనియాలో తమ నివాసానికి రమ్మని ఆహ్వానించారు. నేను ఇండో చీనాకు వెళ్ళేటప్పుడు బటేనియా ఎల్లాగ వెళ్ళవలసి వున్నది గనుక సరేనని వారి ఆహ్వానము అంగీకరించాను.
డచ్చి వరవర్ణులకున్న ప్రకృతి సౌందర్యపూజ, జవాసుందరులకున్న పారలౌకిక విషయానందము ఆ బాలికలో చక్కగా మిళితం అయ్యాయి.