ఈ పుటను అచ్చుదిద్దలేదు
ఆ తరువాత కూతురు శారద, ఆ తర్వాతా కూతురే. దాని పేరు లక్ష్మి అని పెట్టారు. అది పాలబిడ్డ, పిల్లలందరూ కడిగిన ముత్యాలులా వుంటారు.
విష్కంభము 1
హేమసుందరీదేవి త్యాగతి చరిత్ర ఇంతవరకూ చదివేసరికి తెల్లవారిపోయింది. ఒక్కొక్కభాగం, ఒక్కొక్క ప్రకరణం చదవడం, ఏదో ఆలోచనలో మునిగిపోవడం ఈ రకంగా సాగింది ఆ బాలిక చదువు. లోకేశ్వరి ఆమె చదవడం చూచి, చూచి నిదురకూరింది. బాగా తెల్లవారగానే లోకేశ్వరికి మెలకువవచ్చి, చటుక్కునలేచి, క్రిందకుఉరికి, అయ్యో ఎంత పొద్దుపోయిందే హేమ్! నేను ఈవాళ చెప్పవలసిన పాఠాలు తయారుచేసుకోలేదు. స్నానం చెయ్యాలి. తల దువ్వుకోవాలి. అయ్యరుగారికి ఫలహారాదులకు ఏమీ అందివ్వలేదు. అమ్మ ఏమనుకుంటుందో? అంటూ గదితలుపు తీసి పరుగెత్తింది. హేమసుందరి లోకేశ్వరి అన్న ముక్కలే వినిపించుకోలేదు. ఆమె హృదయంలో కోటి ఆలోచనలు నిండిపోయాయి. ఒక మహాసభకు చేరిన మహాజనంలా ఆమె ఆలోచనలు మూగాయి. ఆ జనాని కంతకూ ఉపన్యసించే ఉపన్యాసకునిలా ఒక్క విషయం మాత్రం అన్నింటికన్నా ముందుగా అడ్డం వస్తూన్నది. త్యాగతి తన బావ. ఇంత వరకు తాను ఫలానా అని చెప్పకుండా తనదగ్గర అలా మెలగడానికి కారణం ఏమిటి? కారణం! కారణం! కారణం! రేపు అతన్ని ఏమని పలకరించగలను? అతనితో ఎంతో మహత్తరమైన చరిత్రకూడా వస్తూ వున్నది. ఆ సుశీలతో సంబంధం కలిగించుకోవడం తన అక్కగారి దివ్యస్మృతికి అపశ్రుతి, ద్రోహం అర్పించాడా? ప్రేమ ఉత్కృష్టం అయితే, ప్రేమ నిధానం దుర్మరణానికి పాలయితే, అంత అథోగతిలో పడాలా ఏ వ్యక్తయినా? స్త్రీని అంత నీచంగా తన కాంక్షలు తీర్చే బజారు వస్తువుగా మాత్రం చూచాడు! అయితే ఆ వెనక అతడు పడిన బాధ? తన ఆవేదన నుంచి అతడు పారిపోయిన మోస్తరు? స్వామీజీ అతనికి సందర్శన మీయకపోతే, ఆతని గతి ఏమయి ఉండును! గంగానదిలోపడి ప్రాణం పోగొట్టుకొని ఉండును! ఆ దుఃఖంతో అతని తల్లీ ప్రాణం వదిలేసి ఉండును.