నేను చెన్నపట్నం వెళ్ళలేను. మా మావగారినీ, అత్తగారినీ చూస్తే నేను ముక్కలయిపోతాననే భయం నన్నువదలలేదురా!
అది నీ యిష్టం. ఇంతకూ నువ్వేమి చేయదలచుకున్నావు?
హరిద్వారంలో స్వామిదగ్గరగా ఉండి కొంతకాలం గడుపుతాను. ఇక్కడ రెండేళ్ళపాటు సంస్కృతం చదువుకొంటాను. బొమ్మల విషయము చూచుకొంటాను. భారతీయ కళలకు సంస్కృత సాహిత్య మహాసముద్ర మథనం కొంత ఉండాలి. ఏమంటావు?
నీ యిష్టంరా! కాని మధ్య మధ్య భట్టిప్రోలు రావా ఏమిటి? బందరూ అవీ వెళ్ళి వదినలను, వారి పిల్లలను, మీ బావగార్లను చూస్తూ వుండు మరి?
అయ్యో రానాయేమిటి! ఏడాదికి ఒకసారైనా వస్తాను, అక్కయ్యల నిద్దరినీ చూడను మరి! వాళ్ళను, మా మేనకోడళ్ళను, మా మేనల్లుళ్ళను చూచి నూరు సంవత్సరాలయినట్లు ఉందిరా!
అత్తయ్య కూడా ఇక్కడే వుంటుందా?
ఆ! ఇక్కడ నేనున్నంతకాలమూ వుంటుంది. నేను యెక్కడికైనా మా అమ్మరాలేని ప్రదేశాలకు వెడితే మాత్రం, మా అమ్మను భట్టిప్రోలు పంపుతాను.
మా హిమాలయయాత్ర పూర్తికాగానే మా సుబ్బులు వెళ్ళిపోయాడు. నేను రెండు సంవత్సరాలు హరిద్వారంలో సంస్కృతం దీక్షతో చదువుతూ పంచకావ్యాలూ లఘుకౌముదీ పూర్తిచేశాను. ఆ రెండు సంవత్సరాలలో ఒకసారి, మా పెద్దక్కగారి ఊరు బందరూ, మా చిన్న బావ వుద్యోగం చేసే నరసారావు పేటా వెళ్ళాము. మా పెద్దబావగారు బందరులో వకీలు. నెలకు రెండు మూడు వందలు వృత్తిలో వస్తాయి. పొడుగ్గా వంగిపోయినట్లు వుంటాడు. వారికి సాలుకు మూడు నాలుగువేల రూపాయలాదాయం వచ్చే వసతీ వుంది.
మా పెద్దక్కగారి పేరు వెంకటరంగమ్మ. ఆమె కొంచెం పొడుగ్గా బలంగా వుంటుంది. అచ్చంగా మా నాన్నగారి పోలిక. తన కుటుంబం' తన భర్త, తన చుట్టాలు తప్ప ఇంకోవిషయం ఏమీ తన కక్కరలేదు. ఆవిడకు ఆ ముప్పది ఒకటో సంవత్సరానికే ఆరుగురు సంతానము. ప్రథమ సంతానం ఒక కొడుకు. వాడిప్పుడు స్కూలు ఫైనలు పాసై ఇంటరు సీనియరు చదువుతున్నాడుల్. వాడు చక్కని బొమ్మలు వేస్తాడు. మేనమామ పోలికే అని వాణ్ణందరూ అంటారు. వాడి పేరు విశ్వనాథం. వాడి తర్వాత ఇద్దరాడ పిల్లలు. పెద్దదానికి పెళ్ళి అయినది. దాన్ని గుడివాడ ఇచ్చారు. దాని పేరు సరోజిని. మా రెండో మేనకోడలు సరళకు శారదాశాసనం వస్తుందని తొమ్మిదవ ఏటనే మా బావ నేను కాశీలో వున్న రోజుల్లో పెళ్ళిచేశాడు. మా అమ్మ అప్పుడు బందరు పెళ్ళికివెళ్ళి వచ్చింది. తర్వాత కొడుకు రామకృష్ణుడు,