వారికి పూర్తిగా తెలుసును. మేము వారి ఆశ్రమంలో ఉన్న నెలరోజులూ అనేకమంది శిష్యులువచ్చి స్వామీజీ దర్శనం చేసి వారి మాటలు విని ఆనందించి వెళ్ళిపోతూ వుండేవారు.
మా సుబ్బులు తిరిగి భట్టిప్రోలు వెళ్ళిపోయాడు. మా అమ్మగారిని తీసుకొని శీతాకాలమని జగన్నాథం వచ్చాను. ఫిబ్రవరి నెల వచ్చేవరకు జగన్నాథం, భువనేశ్వరం, కోణార్కం, సాక్షిగోపాలం, శ్రీకూర్మం, ముఖలింగం మొదలైన ప్రదేశాలన్నీ చుచాము.
నేను నేపాలునుండి హరిద్వారం రాగానే నా చిత్రలేఖనాలన్నీ మా గురువుగారు పరిశీలించారు. నేను కైలాస పర్వతం చేరేవరకూ వేసిన బొమ్మలు ఒక రకం అన్నారు. అక్కడనుంచి వేసిన బొమ్మల స్వరూపమే మారిపోయిందట. హిమాలయ పర్వతాలలో మొదటి యాత్రాస్థలాల్లో ఉన్న ఎత్తేనా మొదటిభాగం బొమ్మలట. రెండవభాగం బొమ్మలు, హిమాలయం నడిగడ్డపై ఉన్న ఎత్తును తెలియజేస్తాయట. 1932ఫిబ్రవరి నెలలో కలకత్తాలో నా చిత్రాలన్నీ ఒక ప్రదర్శనం ఏర్పాటు చేశారు స్వామీజీ. వాటి ఖరీదులు ఆయనే పెట్టారు. స్వామీజీని, ద్యూపాంగు ఆశ్రమాన్ని, ఆశ్రమంలో శిల్ప గురువును రచించిన చిత్రాలు కొన్ని, కైలాస పర్వతేశ్వరుని చిత్రాలు కొన్ని, నేపాలు కొన్ని నేను అమ్మనన్నాను.
నా బొమ్మలన్నీ నూట డెబ్బది ఎనిమిది ఉన్నాయి. నేను తీసిన స్కెచ్చిలు మూడు వందల ఏభై ఉన్నాయి. నేను అమ్మదలచుకోనివి తప్ప తక్కిన బొమ్మలలో అయిదు తప్ప తక్కినవన్నీ అమ్ముడై నాకు పదివేల ఎనిమిది వందల అరవై మూడు రూపాయలు వచ్చినాయి. మోడరిన్ రివ్యూ, అమృతబజారు పత్రిక, స్టేట్సు మన్, వంగబాణి మొదలైన వంగ భాషా పత్రికలు నా చిత్రలేఖనాన్ని చాలా ప్రశంసించాయి. నా చిత్రాలలో కొన్నిటి ప్రతిరూపాలు కూడా ఆ పత్రికలో ప్రకటించాయి. ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక, ఈ పత్రికలను చూచి వార్తలు ప్రకటించాయి. వీనిలో నా పేరు టి. శర్వరీభూషణ్ అని పడింది. నా వారెవ్వరికీ శ్రీనాథమూర్తే ఈ చిత్రకారుడు అని తెలియదు. మార్చినెలలో మా అమ్మా, నేనూ తిరిగి హరిద్వారం చేరుకున్నాము. అక్కడ పంచలోహాత్మకంగా కొన్ని విగ్రహాలు పోతపోశాను. నచ్చనివి తిరిగి కరిగించి వేశాను. నేపాలులో విగ్రహాలు పోతపోయడం, అవి బాగుచెయ్యడం, మెరుగు పెట్టడం నేర్చుకున్నాను.
మార్చి నెలాఖరున మా అమ్మా, నేనూ, మా సుబ్బులు హిమాలయ యాత్ర ప్రారంభించాము. మా అమ్మకు బదరిలో జ్యోతిర్దర్శనము చేయించాలని నా కోర్కె. మా అమ్మ, నేనూ కలిసి బదరీక్షేత్రం ముందర దర్శించాము. అక్కడినుండి కేదారేశ్వరం, కేదారంనుండి గంగోడ్తరి, గోముఖం, అక్కడినుండి యమునోత్తరి సందర్శించాము. మాతో మా సుబ్బులు రావడం నా కెంతో