ఈ పుట అచ్చుదిద్దబడ్డది
చేసుకోలేకపోయాను. తమ స్నేహానికి నన్ను అర్హుణ్ణి చేసింది నా గురుదేవుడే. ఈ దేహమున ప్రాణాలు తమ మధుర స్నేహాన్ని ఎప్పుడూ వాంఛిస్తూంటాయి. త్వరలోనే మీ భవనానికి మా అమ్మగారితో కూడా వస్తాను. స్వామీజీని, మిమ్మల్ని, ఈ స్వాములను వదలి ఉండడం కష్టం! అయినా గురుదేవుల ఆదేశం నేను ఉల్లంఘించలేనుకడా! తమ అందరి దగ్గరా సెలవుఅన్నాడు.
జమీందారుడూ, శ్రీనాథమూర్తీ కౌగిలించుకొన్నారు. శ్రీనాథమూర్తి నా పదాలకు నమస్కారం చేశాడు. తక్కిన స్వాములందరికీ పాదాభి వందనాలు అర్పించాడు. కూలీ లందరకూ మంచి బహుమతులు ఇచ్చాడు. అందరమూ బరువయిన హృదయాలతో విడిపోయాము.
శ్రీనాథమూర్తి ముందుయుగం వాడు. అతడు తప్పక అసలు నిజం కనుగోనడానికే పుట్టాడు. కైలాసేశ్వరుడు అతనికి చిరాయురారోగ్యాలు, ధర్మనిరతీ, సత్యదీక్షా, పురోగమనశక్తీ ప్రసాదించుగాక!
ఓం తత్ సత్
సౌందర్య దీప్తి
1
(హేమసుందరీదేవీ! ఇక్కడనుంచి నేనే నా కథను సాగించి పూర్తి చేస్తాను__శ్రీనాథమూర్తి.)
సౌందర్యారాధన మానవుని వీరత్వమా? కళ మానవునకు అవసరమే లేదా? కళారూపం ఈలా ఉండాలని కళాస్రష్టలకు ఆజ్ఞలు ఇవ్వడం కళకు మంచిదా, నష్టమా? ఈ రకం సాహిత్యం ఉండాలి, ఈ రకం చిత్రలేఖనం ఉండాలి, శిల్పం ఈ మార్గాల నడవాలి అని చెప్పడానికి అధికారం ఉందా?
నా గురుదేవుడు జమీందారుగారితో, అనుచరులతో బయలుదేరి భరతభూమికి ప్రయాణమై వెళ్ళిపోయారు. నాతో వారి శిష్యులు ముగ్గురు మాత్రం ఉన్నారు. స్వామీజీ వెళ్ళుతోంటే తల్లినిబాసే బిడ్డవలె తల్లడిల్లి పోయాను. ఆ చలిలో, ఆ నిశ్శబ్ద వాతావరణంలో కైలాస పర్వత కాంతులు ప్రసరిస్తూ ఉండగా స్వామీజీ, వారి అనుచరులూ మమ్ము వీడ్కొని ప్రయాణం సాగించారు.
మా స్వామీజీ చూపులు కైలాస పవిత్ర సందేశాలు. నా కవి పది ఏనుగుల బలము ప్రసాదించాయి. స్వామీజీ నా కనులకు కనబడేతంట వరకూ ఆ చిన్న పర్వత శిఖరం మీద చూస్తూ నిలుచున్నాను. నా దగ్గర ఉన్న దూరదర్శక యంత్రంతో చూస్తూ నిలుచున్నాను. వారు లోయలో దిగినప్పుడు కనబడరు. మిట్టలు ఎక్కినప్పుడు కనబడినారు. ఆ యంత్రానికి కూడా కనబడనంత దూరం వెళ్ళారు. ఎండ తీక్షణంగా సాగింది. నేనో పెద్ద నిట్టూర్పు వదలి ఆశ్రమంలోకి వెళ్ళిపోయాను. లోపల నా గదిలో కూర్చున్న క్షణంనుండీ నా కనేక రూపాలయిన ఆలోచనలు ఉద్భవించి మాయం కాసాగినాయి.