స్వామీజీ, మానవప్రకృతిలో జంతుప్రకృతి ' ఆహార నిద్రా భయమైధునాని' అన్నది ప్రథమ అనే తామన్నారుగదా. దానిపైన తనేమిటి, తనచుట్టూ ఉండే సమస్తమూ ఏమిటి అనే జిజ్ఞాన వస్తుంది మనుష్యునికి. అది మనస్సుకు సంబంధించింది. ఇదీ తామే అన్నారు. మనస్సు ఎలక్ట్రాను ప్రోటానుల నుండి వచ్చిందా? లేక భౌతిక పదార్ధము మనస్సు నుంచి వుద్భవించిందా? అనే విషయాన్ని గురించీ తామే చర్చించారు. ప్రాణశక్తి ఎలక్ట్రాన్ ప్రోటానుల కలయికవల్ల ఎలా రాదో, ప్రాణశక్తి మనస్సు యొక్క భౌతిక శక్తిపైన వచ్చిన రెండో రూపమైన శక్తిమాత్రమో అవన్నీ తామే సెలవిచ్చారు. మనస్సు యొక్క మూడోశక్తి, సౌందర్యదర్శనానందం. ఈ ప్రకృతిలో దృశ్యంగాని, మానవ చరిత్రలో సఘటనగాని సౌందర్య వంతమై ప్రత్యక్షమైతే, స్మృతికి వస్తే మనుష్యుడు ఆనందం పొందుతాడు. ఈ మూడోశక్తి సౌందర్యాధనశక్తి అని తామే సెలవిచ్చారు. ఈ మూడు శక్తులను గూర్చీ పాశ్చాత్య పండితులందరూ తమ భావాలను పూర్తిగా చెప్పారు.
అవును శ్రీనాథమూర్తీ! ప్లేటో, అరిస్ టాటిల్ దగ్గరనుంచి, అతి ఆధునిక రష్యాతత్త్వవేత్తలవరకు నిర్వచించిన వాదనలు మన రసవాదం అన్నీ పూర్తిగా విచారించి చెప్పవలసిన ముక్కలే!
చిత్తం. ఆవేశ రూపమైన సౌందర్యపూజ శాస్త్రాతీతమని జేమ్సునర్లీ అంటాడండీ. కాని సౌందర్య పూజ మానవ భౌతిక సంబంధమని వాదించేవారూ లేకపోలేదు. ఈ రోజులలో ముఖ్యంగా రాజకీయ, ఆర్ధిక, శాస్త్ర, పారిశ్రామిక వాతావరణాలు మనుష్యుని పూర్తిగా కమ్మివేసి ఉన్నప్పుడు, సౌందర్యానికీ, ఆర్థికోపయోగ భావానికీ, రాజకీయ భావాలకూ, శాస్త్రభావాలకూ ఎక్కువ చుట్టరికం వచ్చింది. ఎంత అయినా సౌందర్య విచారణా, ఆనందమూ మనస్సుకే అని అందరూ ఒప్పుకుంటారు. లలితకళ లెందుకు అన్న విషయం ఉద్భవిస్తుంది. అప్పుడే ఇది మానవ ప్రకృతి అని నిర్థారణ చేశారు.
ఈ మానవ ప్రకృతికి మఖ్యమైన గుణం, తానే ఆ సౌందర్యాన్ని సృష్టించాలని ఇచ్చ కలగడం, అది సృష్టించడం. ఆ తర్వాత తానుగాని ఇతరులుగాని అలా సృష్టించిన సౌందర్యాన్ని దర్శించి ఆనందించడం. ఇంతవరకూ పాశ్చాత్య శాస్త్రజ్ఞులందరూ ఒప్పుకుంటారు స్వామీ!
అవును, ఈనాటి వారి ఉపయోగవాదం త్రివిష్టపశిల్పులైన సన్యాసులకు చిట్టచివర నువ్వు చెప్పితీరాలి. ఆ తర్వాత త్రివిష్టప పండితుల అభిప్రాయా లేమిటో తెలుసుకుందాము.
చిత్తం, పాశ్చాత్య సౌందర్యతత్వం మనవి చేసుకుంటాను. ఈలోగా లలితకళలంటే పాశ్చాత్యుల భావమూ, సిద్దాంతాలూ మనవి చేసుకుంటాను. కళ మనుష్యుని పని. ప్రకృతిలోని వస్తువును మనుష్యుని ఉపయోగం కోసంగాని, మనుష్యుని సంతోషం కోసంగాని, మనుష్యుని వెఱ్ఱికోసం కాని మార్చడం, కలపడం కళ అని పాశ్చాత్యులు పేరు పెట్టారు. ఇక్కడ కూడా తత్త్వవేత్తలు ఇప్పటివరకు రెండు పక్షాలుగా వాదిస్తున్నారు. ప్రకృతిలో లేని పని ఏదయ్యా