మైన ప్రపంచమూ అంత ఆనంద దాయకమే! శాస్త్రకారుడు టిబెట్టును గూర్చి తెలుసుకోవడానికి ఎంతో ప్రయత్నించాడు. అనేకులు పరిశోధకులు కష్టపడి, మారువేషాలతో తిరిగి, ఈ టిబెట్టు రహస్యాలను రవంత గ్రహించారు. అల్లానే ఫలాని నక్షత్రం భూమికి యిన్ని వెలుగు సంవత్సరాల దూరం అంటే, ఈ జ్ఞానం మనుష్యున కెందుకు సంతోషం కలిగించాలి? ఎవరెస్టు శిఖరము ఇరవై తొమ్మిది వేలపై చిల్లర అడుగుల ఎత్తుంటే ఏమి, అందుకు ఒక వేయి అడుగులు తక్కువుంటే ఏమి? ఆ శిఖరం తవ్వి పసిఫిక్ మహాసముద్రం పూడుస్తావా? ఈలాంటి విషయాలు తెలుసుకోవడం ఆనందం. అలాగే శాతవాహనులు ఆంధ్రులా, మహారాష్ట్రులా? వారు ఎవరైనా, కొంపలు మునిగిపోవు. ఇదంతా మానసికం, అలా మానసికంగా గాథలు కల్పించడం ఆనందకారణం. అందువల్ల వచ్చే నష్టమేమీ లేదు. నా ఉపన్యాసం అవగానే మూర్తి నాకు నమస్కరించి ఆలోచనలతో రావణహ్రదం ఒడ్డున కూర్చుండి బొమ్మవేయడం ప్రారంభించాడు.
4 రావణహ్రద సౌందర్యము, మానస సరోవర సౌందర్యముతో సరిపోల్చలేము. రావణహ్రదంలో ఆసురిక సౌందర్యమూ, చిత్రిణీజాతి స్త్రీ మనోహరత్వము విలసితమౌతుంది. మానససరోవర సౌందర్యం అలౌకికము. పద్మినీ జాతి స్త్రీవలె ఆ సరస్సు ప్రత్యక్షమౌతుంది. సరస్వతీదేవి వలె నాట్యం చేస్తుంది. రాజహంసవలె నడయాడుతుంది, యజ్ఞాగ్ని సశిఖాకాంతితో వికసిస్తుంది. మానవసరోవర సందర్శనమాత్రాన పూర్వకర్మ పటాపంచ అవుతుంది. బ్రహ్మానందము సన్నిహిత మవుతుంది.
డెబ్బది రెండు మైళ్ళ వైశాల్యం గలిగి నిర్మల నీల నీరాలతో తెల్లటి ఆ మంచుప్రదేశంలో సతీదేవి ధవళ వక్షోజ నీల చూచుకం వలె బిడ్డలైన భక్తులకు దర్శన మిస్తుంది. సకల విశ్వాత్మికమగు అధికమానసిక ప్రతిబింబ మీ మానస సరోవరం. విశ్వంలో భూగోళము, విచిత్ర భగవల్లీలారంగము. ఆ భూగోళంలో భరతదేశం విశ్వమాత. ఆ మాతకు వక్షోజాలు హిమాలయాలు , హృదయం బదరీనారాయణం, మనస్సు మానస సరోవరం, శిరస్సు కైలాసం, సహస్రారం కైలాసశిఖరం. ఈ రాజ రాజేశ్వరి భావం, ఈ కామకామేశ్వరీ భావం, నాబోటి యోగవిద్యార్దులకే దృశ్యాదృశ్యం.
శ్రీనాథమూర్తి మానస సరోవరాన్ని చూచి నిర్విణ్ణుడై ఆ దివ్య సౌందర్యం అతన్ని ముంచెత్తగా, ఆనందం అతన్ని వణికించగా, అశ్రుబిందువులు గంగాధారలై ప్రవహింప నవ్వుతూ, వెక్కివెక్కి ఏడ్చినాడు. కొంతసేపటికి సమ్మాళించుకొని, అతడు యోగివలె కౌపీనమాత్రధారియై, ఆ భయంకర శైతల్యంతో నాతోపాటు మానస సరోవరంలో స్నానం చేశాడు. ఒంటినిండా బూడిద పూసుకొని శుభవస్త్రాలు ధరించి నెగడి దగ్గర కూర్చుండి ఉత్త