ఈ పుటను అచ్చుదిద్దలేదు
నేనో మంచుకొండనైతిని. ఎన్ని కల్పాలనుండో నాలో పేరుకొనియున్న హిమపర్వతాలు, వేడినే ఎరక్క ఇంకనూ పేరుకుపోతున్నాయి, పెరిగిపోతున్నాయి. నా హృదయంలోని చైతన్యం గడ్డకట్టుకుపోయినది. ఆనాటి నా మంచుగడ్డ బ్రతుకుపై ఒక్క సూర్యకిరణం పడి, ఆ మంచుగడ్డ శకలాలలో ఏడు వర్ణాలుగా రూపం పొందింది. లోకం వర్ణమయమైంది. నా బ్రతుకు ఆ కిరణకాంతి ప్రసరింపువల్ల నెమ్మదిగా కరగడం ప్రారంభించింది. గజగజ వణికిపోయాను. నాకు మెలకువవచ్చి తొందర తొందరగా బదరి చేరాను. జనుల కోలాహలం ఆ పర్వతాలలో ప్రతిధ్వనిస్తూ ఉన్నది.
నేను వెళ్ళీవెళ్ళగానే బదరీనాథ ఉష్ణకుండంలో స్నానంచేసి వేయి ఏనుగుల బలంతో వచ్చి, ఉన్నిదుస్తులు ధరించి బదరీనాథ స్వామి దర్శనానికి వెళ్ళాను. ఆ దేవాలయంలో జరిగే తంతంతా చూచి ఇంటికి తిరిగి వచ్చి నిద్రపోయాను. ఏమిటి నాకీ హిమాలయ ప్రయాణం? ఈ బదరీనాథ యాత్ర ఎంత విచిత్రంగా పరిణమించింది. ఈలాంటి మహా విచిత్ర స్థలాల్లో మనుష్యుడు ఎన్ని దేవుళ్ళనైనా కల్పించుకోగలడు! నాకు మాత్రం బదరీనాథుడు మనుష్యుడు చెక్కిన విగ్రహంలాగే కనిపించాడు. కాని మనుష్యుడు ఎంతో కష్టపడితేనే గాని, తన మనస్సులోపుట్టిన ప్రపత్తి భావాన్ని నిర్మలమూ, నిశ్చయమూ, చేసుకోలేడు. ఎన్ని యుగాలనుంచి ఈ బడరీనాథుడు ఈ మంచుకొండల ప్రదేశంలో వెలసివున్నాడో! పాండవులీ శీతల ప్రదేశానికి వచ్చారట! క్రీస్తు పూర్వం కొన్ని వేల ఏళ్ళ క్రింద ఆర్యులు ఉత్తర భూములలో బదరికాశ్రమాన్ని నిర్మించుకొన్నారు. ప్రపంచానికి పదివేల అడుగులపై చిల్లర యెత్తున, ఎక్కడో అలకనందానదీ జనన ప్రదేశాలలో ఈ మహాక్షేత్రం, మణిపూసలా పొదగబడివుంది. 38 మరునాడు స్వామీజీ బ్రహ్మకపాలంలో నాచేత మా తండ్రిగారి శ్రాద్ధం పెట్టించారు. బ్రహ్మకపాలంలో శ్రాద్ధం పెడితే మళ్ళీ ఆ పితరులకు శ్రాద్ధాలు పెట్టకూడదట. ఎందుకంటే బ్రహ్మకపాల శ్రాద్దంవల్ల పితరులకు మోక్షం వస్తుందట. ఒకసారి మోక్షంవస్తే మళ్ళీ పితరులను ఎలా ఆహ్వానిస్తాము? ఏది ఏమయితేనేమి ఒక గొడవ వదలిపోతుంది. అందుకనే నేను ఒప్పుకున్నా. స్వామీజీ కూడా నీకిష్టమైతేనే పెట్టు, యిష్టం లేకపోతే మానెయ్యి! అన్నారు. అందులో వుండే లాభాలాభాలు చూసే నేను ఒప్పుకున్నాను. స్వామి దర్శనము, పూజలు అన్నీ ఏదో గౌరవంకోసం చేయించాను. నాకు దేవుళ్ళమీద గౌరవము కంటే ఆ ప్రదేశాలమీద ప్రేమ యెక్కువైంది. నా వెనకాల ప్రసరించి వున్న వెలుగు నీడల్ని మరచిపోయాను.