పాండవులు ఈ దారిని వెళ్ళారు. మహాఋషులనేకులు ఇక్కడే వాసం చేశారు. ఈనాటికీ ఈ జనం వస్తూనే ఉన్నారు. పండాలు, గర్హవాల్ సంస్తానోద్యోగులు, బ్రిటీషు ప్రభుత్వోద్యోగులు ఇక్కడ వాసం చేస్తున్నారు. భోజన పదార్థాలు సంపాదిస్తున్నారు, వంటలు చేసుకుంటుంన్నారు. ప్రేమించుకుంటుంన్నారు. ఆనందిస్తున్నారు, కష్టాలుపడుతున్నారు, ధుఃఖిస్తున్నారు, స్త్రీ పురుషులు కామించుకొంటున్నారు, బిడ్డలను కంటున్నారు.
ఓహో! ఈ హిమాలయ ప్రపంచానికీ, క్రింద భారతీయ విశాలసమ ప్రదేశాలకూ ఎంత తేడా! హృదయాలు దోషకళంకపూరితాలై ఉంటాయి అక్కడ. జీవితం కర్కశమై, చెడుదారులనే ఆశిస్తుంది. ఈ హిమాలయాలలో, ఈ ఎత్తయిన కొండలలో, ఈ రాళ్ళలో, మంచుగడ్డలలో, అతిశీతలపు నదులలో, హెచ్చుతగ్గులలో జీవనం ఎంత ఆర్ద్రం? ప్రేమమయం. ఈ అతి కర్కశభూములలో ఎంత నిధానమైన, కల్మషరహితమైన జీవితాలివి అనుకున్నామ. 37 అడవులనిండా తెల్లగులాభీపూలు, పర్వత గ్రామాలలో బంగారు గులాభీపూలైన యవ్వనవతులు. ఆ అడవులలో, ఆ లోయలో, ఒకప్రక్క మహోన్నత పర్వతాలు, ఒకప్రక్క పాతాళ ప్రదేశంలో మహావేగంతో, సంతతగంభీరాగ హృదయంతో ప్రవహించి పోతున్న అలకనంద.
జోషీమఠం చేరాము. జోషీమఠం పెద్దబస్తీ. ఊరంతా తిరిగి, చమరీ మృగపుతోళ్ళు, పెద్దపులితోలు ఒకటికొన్నాను. తెల్లచిరుతపులి తోలు సంపాదించాలని కోర్కెకలిగింది. అక్కడ ఆ గాంధర్వశిల్పులు రచించినచిత్రాలు, దారుశిల్పాలు కొందామనుకుంటే, స్వామీజీ తిరుగుదారిలో కాని, మా అమ్మను తీసుకుని రెండవసారి ప్రయాణం చేసినప్పుడు కాని కొనవచ్చునన్నారు.
జోషీమఠం నుంచి విష్ణుప్రయాగ చేరాము. తర్వాత పాండుకేశ్వరము, లంబర్ ఘట్టీ, హనుమాన్ చట్టీలలో మకాములు చేసుకుంటూ బదరీ దర్శన ప్రదేశం చేరాము. అందరికీ తన్మయత్వాలు కలిగి విశాల్ బదరీ లాల్ జీకి జై అని పర్వతశిఖరాలు మారుమ్రోగుతూ ఉండగా నాట్యం చేసినంత పనిచేశారు. మా స్వామీజీకి ఒడలు తెలియలేదు. ఆయన ఒక రాతి బండమీద పద్మాసనం వేసుకొని, బదరివైపు తిరిగి సమాధిలోనికి పోయినారు. అందరూ నిశ్శబ్ధం వహించారు. నేను జాగ్రత్తగా ప్రక్కనున్న ఒక సానువును కొంతవరకు నా ఇనుపమొనకఱ్ఱ సహాయంతో ఎక్కి, అక్కడ కూర్చుని బదరీనాథ్ వైపు దృష్టిపరచి, ఆదృశ్యం గమనిస్తున్నాను.
ఈలా క్షేత్రాలని పేరుపెట్టి, భారతీయులు తిరిగే దేశాలు ఈ నాగరికత ఏమిటి? ఏమిటీ బదరీనాథం? ఇక్కడ నరనారాయణులు తపస్సు చేశారా? ఏమో? శకుంతలా! నన్ను వదలి ఎందుకు వెళ్ళావు? ఈ నరనారాయణులు నిన్ను బ్రతికి ఉండునట్లు చేయలేకపోయారా? మంగళగౌరి, శ్రావణలక్ష్మి, ఎన్ని పూజలు చేశావు! నా శకుంతలా!