మంచు కప్పిన పర్వత శిఖరాలు, చలీ. ఎంత చక్కని దృశ్యం! కన్నుల పండువ చేస్తున్నది. నాకేమి బుద్దిపుట్టిందో నా పెట్టెలో ఉన్న బొమ్మలు వేసే స్కెచ్చి పుస్తకము, రబ్బరుముక్క, పెన్సిలు తీశాను. అయిదారు బొమ్మలు వేశాను. చమరీ మృగాలను తోలుకువెళ్ళే మనుష్యులు, ఆ సన్నని ఇరుకు దారి, క్రింద అలకనంద మహావేగంతో ప్రవహించడం? రాళ్ళు, మంచు, హిమానీజలాలు, స్వాచ్ఛ నీలాకాశం, ఏలాగు వేగవంతాలై నావేళ్ళు ప్రసరించి పోయినవో కాని ఎంతో చక్కని బొమ్మలు ఉద్భవించాయి. మా రాజపుత్ర జమీందారుని, స్వాములందరినీ, కూలీలను, మా పొట్టి గుఱ్ఱాలను అన్నీ బొమ్మలు వేయడం ప్రారంభించాను. లేప్చాలు, భూటియాలు, గర్ష హవాళీలు, ఆడవారు, వారి పనులు, నాట్యాలు అన్నీ వేయసాగాను. మా జట్టంతా ముందు వెళ్ళింది. నేను వెనకాలే వస్తానని, బొమ్మలు గీసుకుంటూ నెమ్మదిగా వెళ్ళాను. యాత్రికుల జట్టు లెన్నో జ్యోతిర్దర్శనం చేసుకొని వస్తూన్నావట, ఏమిటో ఆ జ్యోతి?
బదరీనారాయణస్వామి గుడి పదివేల అడుగులపై చిల్లర ఎత్తు ఉండడం చేత శీతాకాలంలో ఆ ప్రదేశం అంతా తెల్లటి వెన్నలాంటి మంచుతో కప్పబడి పోతుంది. అందువల్ల ఆ ప్రదేశంలో ఎవ్వరూ ఉండలేరు. దేవుళ్ళ ఉత్సవవిగ్రహాలు తీసికొని, పూజారులు జోషీమఠంలో వచ్చి ఉంటారట. కొందరు నందప్రయాగ వెళ్ళి ఉంటారట. దీపావళి అమావాస్య వెళ్ళగానే స్వామి దేవాలయంలో ఒక అంగడిలో ఆవునెయ్యి అయిదు శేర్లు పోసి, వత్తి ఉంచి, జ్యోతి వెలిగించి, తలుపులుమూసి, తాళంవేసి, సీళ్ళు వేస్తారట. మళ్ళీ ఏప్రియల్ నెలలో సుభదినంనాడు ద్వారాలసీళ్ళు తెరచి, తలుపులు తెరిస్తే బదరీనారాయణజ్యోతి వెలుగుతూ వుంటుందట. అనేకులు పెద్దలూ, పిన్నలూ ఆ జ్యోతిని సందర్శించడానికే ఆ రోజున వస్తారట. బదరీ విశాలలాల్ జీకి జైయని పరవశత్వంతో జ్యోతిని దర్శనం చేసుకొని నమస్కరిస్తారట. ఈ జ్యోతి ఆరునెలలు మంచుచేత కప్పబడి పూడిపోయిన గుళ్ళో ఎల్లా వుంటుంది? శాస్త్రదృష్యా అది అసంగతము. ,మంచుచేత కప్పబడిన బొగ్గుపులుసు గాలిని వదలుతూ ప్రాణవాయువు అంతా అయిపోవడం చేత ఆరిపోవాలి. అదీగాక అయిదు శేర్లు నేయి దీపం రెండు రోజులలో వెలిగి దీపం కైలాసం అంటుతుంది. అలాంటిది దీపం ఆరదు, నెయి యింకా శేరు మిగులుతుందట!
ఇది దేవతల మహత్తు అంటారు! మంచుచే కప్పబడిన అతిశీతల వల్ల కర్చుచేసే ప్రాణవాయువూ, నెయ్యికూడా తక్కువేమో! ఈ విచిత్రం కూడా తప్పక శాస్త్రాని కందుతుందనే నా ఉద్దేశం. హిమాలయ ప్రయాణం ఆరోగ్యదాయకమని మన పూర్వులు బడరీకేదారాది యాత్రలు చేశారని నా ఉద్దేశం. ఈ మాత్రం ఆలోచించడం ప్రారంభమైంది నాలో, ఇంతలో మాజట్టు వెనకాలే జోషీమఠం చేరాను. ఎన్నో దేశాలవారు యాత్రకు వస్తున్నారు. బిడ్డలు, యవ్వనులు, పెద్దలు, ముసలివారు నిర్భయంగా భక్తితో ఈ కష్ట మార్గాల వేలకొలదీ సంవత్సరాలనుండి ఈ యాత్రలు చేస్తున్నారు.