మందాకిని ఆకాశనది, కేదారనాథ క్షేత్రం దగ్గర ఈ నది పుట్టిన స్థలము. అలకనంద అలకాపురం దగ్గర పుట్టింది. అది మానవులు దర్శింపలేని హిమాచల శృంగస్థలము. బదరీ నారాయణానికి యెగువగా పన్నెండు పదమూడు మైళ్ళదూరంలో ఈ అలకాపుర ప్రదేశం ఉంది. ఒకప్పుడు యక్షజాతి మనుష్యులు (ఈనాడూ దారి పొడుగునా వారు కనిపిస్తారు) పొట్టి మంగోలీ జాతివారు, టిబెట్టు జాతికి చుట్టాలు, అక్కడ ఉండేవారనీ, హిమాలయాలలో ఎప్పుడూ సంభవించే హిమపాతాలవల్ల ఆ పట్టణం పూడిపోయిందనీ నా ఉద్దేశం. కాళిదాసుని మేఘసందేశయాత్ర కూడా ఇక్కడికే వస్తుంది. ఇక్కడినుంచే కైలాసపర్వతానికి దారి ఉంది.
33 హృషీకేశంగాని, ఆ తర్వాత మా ప్రయాణంలో మకాములుగాని నన్ను కప్పిన మంచుతెరలను చీల్చలేకపోయాయి. నాగుర్రాన్ని నేను ఎక్కదలచుకోలేదు. కూడ ఉండడం మంచిదని ఎంచాను. మురికిరేతి, లక్ష్మణ ఝాలా, గరూర్హ చట్టీ, పూల్ వారీ, గులార్ చట్టీ, నయీమోహన్, చహోటీ బిజానీ, బర్హిబిజానీ, కుండు చట్టీ, బందర్ ఖేల్, మహదేవ్, నెమాల్ చట్టీ, కండీ చట్టీ, వ్యాసఘట్టం, ఉంరాసు ప్రదేశాలన్నీ మోటారు బస్సుమీద వెడుతూ చూశాను. బస్సు ప్రయానంలేని రోజుల్లో, ఈ మజిలీలన్నీ మకాములు చేసుకుంటూ, దేవప్రయాగ చేరుతారు. మా జట్టులోని వారొకరు నాకీ ప్రదేశాలన్నీ చూపిస్తే, 'ఉహూ' అంటూ చుచానేగాని నా మానస ఫలకం మీద ఇవేవీ చిత్రితం కాలేదు.
దేవప్రయాగలో ఒక దినం ఆగి, అక్కడ మా కూలీలనూ, గుర్రాలనూ కలుసుకొని మర్నాడు తెల్లవారగట్ల లేచి విశాలబదరీనాథ్ కి జై య్ కైలాసేశ్వర్ స్వామీజీకి జై అని మా ప్రయాణం సాగించాము. తెల్లవారగట్లకే వెలుగు బాగా వచ్చింది. చలిలేనేలేదు. కొద్దికొద్ది దూరాలే ప్రయాణం సాగంచవలసి ఉన్నది. నీరు కాచి త్రాగుచుంటిమి. ఒక సన్యాసి వంట బాగా తెలిసినాయన మా కందరకూ వంట చేస్తున్నాడు. ఆ రాజపుత్ర జమీందారు జట్టుకు వారి వంటమహరాజ్ ఉన్నారు.
మేము లక్ష్మణఝాలా వంతెన దాటకుండానే గంగానది పడమటి ఒడ్డునే మొటారుమీద వచ్చాము. నాకై ఐదువేల రూపాయలు మాత్రం ఉంచుకొన్నాను. తక్కిన రూపాయలు హరిద్వారంలో బ్యాంకులో వేసి తెనాలికి మా అమ్మగారి పేర హుండీ ఇచ్చాను. ఆ అయిదువేలలో మూడువేల రూపాయలు నా పేర బ్యాంకిలో వేసుకోమని స్వామీజీ సలహా ఇచ్చారు. కైలాసం వెళ్ళేదారిలోనూ, నేపాలులోనూ బ్రిటీషు వెండి రూపాయలు బాగా చలామణీ ఉంది. నేపాలులో నేపాలూ ప్రబుత్వం బ్యాంకులో మన నోట్లకు వారి డబ్బు మార్చుకోవచ్చునట. తిబెత్తులో మాత్రం మన సోమ్ముకే ఎక్కువ విలువట.