ఈ పుటను అచ్చుదిద్దలేదు
విష్కంభము
హేమసుందరి త్యాగతికథ ఇంతవరకు చదివేటప్పటికి తెల్లవారగట్ల రెండున్నర అయినది. ఎంత విచిత్ర సంఘటన! త్యాగతి అలా అయినాడా? తన బావ స్త్రీనాథమూర్తేనా ఈ త్యాగతి? ఎన్ని భాదలు తెచ్చి పెట్టుకున్నాడు. అతన్ని గర్హించాలా, లేక అనుక్రోశించాలా? ఆమె ఆ పుస్తకాన్ని పక్క సోఫామీద పెట్టింది. సుశీల విషయంలో అతడు పప్పులోకాలు వేశాడు! కాని అతడేమి చేయగలడు? కాశ్మీరంలో, లాహోరులో, సుక్కూరులో అతని పోకడలు అసహ్యంగా,జుగుప్సారకంగా ఉండలేదా? స్త్రీ అంత చులకనా? స్త్రీ అంటే అంత పశుభావమా? కాని ఈ గ్రంథం ఇంత బట్టబయలుగా త్యాగతి రాయడంలో ఉండే పరమార్ధ మేమిటి? ఈ గ్రంధం అచ్చు వేస్తాడా?
ఆ గ్రంథాన్ని మళ్ళా తీసింది. మొదటి పేజీ చదివింది. ఈ నా తుపాను హేమకుసుమదేవికోసం మాత్రమే! ఆమె నేను ఎవరినో తెలియక నన్ను గురించి అనేక ఊహలు ఊహించుకొంటున్నది. ఇంక నేను రహస్య వ్యాజాన అసత్యదోషాన్ని ఆచరిస్తూ ఉండలేను. నేను చేసిన పని గురువు ఆదేశం మీదనే! నీకు ఉచితమని తోచిన మరుసటి క్షణంలో నీ రహస్యం నీ వాళ్ళకు చెప్పుఅని గురువుగారన్నారు. అయినా ఆ కాలపరిమితిని కూడా నేను కావాలని దాటబుచ్చాను.
హేమసుందరితో స్నేహం వాంఛించాను. నాలో బయలుదేరిన సమస్యను నేను విడదీయలేకపోయాను. ఆ కారణంచేత నా గురువు అజ్ఞా ప్రకారం కొన్ని నెలల క్రిందటనే హేమకు నా విషయం యావత్తు పూర్తిగా చెప్పుదామని ప్రయత్నం చేశాను.
కాని,అలా చేయలేకపోయాను. ప్రచ్ఛన్నంగా ఉండి మాయవేషం వేసిన దోషం నన్ను పూర్తిగా అలముకొన్నది. ఆ దోషానికి నేనే భాద్యుణ్ని.
అయితే హేమా! నా కథ చివరివరకూ చదువు. అప్పుడు నన్ను క్షమించు అంతే నేను కోరేది.
తన కోసమేనా? త్యాగతి ఈ కథ వ్రాసింది? అతని ఉద్దేశం?
హేమ అలా ఆలోచనతో కూర్చుండపోయినది. త్యాగతి అంటే ఏవేవో స్వప్న సౌధాలు కట్టడం ప్రారంభింది. అతడంటే ఏవేవో విచిత్ర భావాలు తనకు కలగడం ప్రారంభించాయి. అతన్ని తాను....ప్రేమిస్తున్నానా అనుకుంది. అతడంటే తనకున్న గౌరవం అప్రతిమానమైన స్థితికి వచ్చింది.
అతడు తన బావ శ్రీనాథమూర్తేనని తెలియగానే హేమసుందరి అత్యంతాశ్చర్యంలో మునిగిపోయింది. అతని కథ తెలుస్తున్న కొలదీ ఆమెలో ఏవేవో విచిత్రభావాలు కలిగి అణగిపోతున్నవి. అతని ఆ జీవితానికి ఈనాటి త్యాగ