వాక్యము శత్రువును దూషించునపుడు అనుటకు తిట్టుగ వినియోగించు చున్నప్పటికి ఇది పూర్వకాలము తిట్టుగ కాకుండ దీవెనగ ఉండెడిది. పూర్వము ఈ వాక్యము దీవెనగ ఎట్లుండెడిదో విశధీకరించుకొందాము.
పూర్వము అవినాశ్ అనబడు ఒక శిష్యుడు గురువువద్ద జ్ఞానము తెలుసుకొనుచుండెను. ఒక దినము సాయంకాలము ప్రక్కనేవున్న నది ఒడ్డున ఇసుక తిన్నెమీద గురువు కూర్చొని ఉండగ ఆయన ముందర కొందరు శిష్యులు కూర్చొని ఉండిరి. అందులో అవినాశ్ అను శిష్యుడు కూడ కూర్చొని ఉండెను. అవినాశ్ కొత్తగ వచ్చిన శిష్యుడు కావున మిగత శిష్యులకు కూడ అతని పేరు తెలియునట్లు నీ పేరేమిటి అని అవినాశ్ను గురువుగారడిగారు. అపుడు అతను నాపేరు అవినాశ్ అని తెలిపాడు. ఆ పేరు విని చిరునవ్వు నవ్వుకొన్న గురువు ఈ పేరులోని అర్థము తెలుసా అని మిగతావారినడిగాడు. అపుడు వారిలో కొందరు తెలియునని, అవినాశ్ అంటే నాశనము లేనివాడని అర్థము చెప్పారు. తర్వాత గురుశిష్యుల మధ్య కొంతసేపు సంవాదము జరిగినది. ఆ సంభాషణలో మొదట గురువు ఇలా అడిగాడు.
గురువు : ఈ పేరు ఇతను పుట్టిన తర్వాత పెట్టినదా లేక ముందునుంచి ఉన్నదా?
శిష్యులు : ఈ పేరు పుట్టిన తర్వాత పెట్టినదే స్వామి.
గురువు : పుట్టిన తర్వాత వెంటనే పెట్టలేదు కదా! పుట్టిన కొన్ని రోజుల తర్వాత పెట్టిన పేరు కదా!
శిష్యులు : అవును స్వామి
గురువు : పేరు పెట్టకముందు ఇతని పేరునేమని చెప్పాలి?
శిష్యులు : మొదట జీవుడని తర్వాత అవినాశ్ అని చెప్పాలి.