పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/633

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కూచిపూడి వారసులే కోటకొండ భాగవతులు

భరత నాట్య సంప్రదాయ ప్రవర్తకులలో కూచిపూడి కన్న ప్రథములు పోతకమూరి భాగవతులు. వీరు అహోబల స్వామి సన్నిధిని నాట్యాచార్యులై నిత్య నాట్య సేవ చేసారు.

శ్రీవెలయపాల వారధి పవ్వళించి జోజో, అన్న జోల పాట ఈ భాగవతులు రచించిందే. వీరిని తాళ్ళపాక అన్నామాచార్యులే పేర్కొన్నారన్న, గీత నాట్యాలలో వీరికి గల ప్రతిభ వ్వక్తం కాగలదనీ వీరు 1280 ప్రాంత్రపువారనీ తెలుస్తూంది. దీనినిబట్టి భాగవతకళ రాయలసీమలో తర తరాలుగా ప్రచారంలో వున్నట్లు తెలుస్తూవుంది.

భాగవత కళ, నవాబుల ఆదరణ:

భాగవత కళను రాయలసీమలో విరివిగా ప్రచారం చేయవలెనన్న తలంపుతో క్రీ॥శ॥ 1700 - 1750 ప్రాంతాలలో బనగానిపల్లె నవాబు గారు కూచిపూడి నుండి కొందరు కళావేత్తల కుటుంబాలను ఆహ్వానించి కోటకొండ, కపట్రాల గ్రామాలలో వారికి భూములు ఇచ్చి, వారి చేత కర్నూలు జిల్లాలో భాగవత కళ ప్రచారాన్ని ప్రోత్సహించారు. అప్పటిలో కూచిపూడి నుండి తరలి వెళ్ళిన కుటుంబాలలో ప్రథముడు చల్లా భాగవతం దాసం భొట్లు, సిద్ధేంద్రయోగి నేర్పించిన పారిజాతాపహరణాన్ని పారంపర్యంగా ప్రదర్శించిన వారిలో చల్లావారు ముఖ్యులు. తొమ్మిదవ తరానికి భరత శాస్త్రం లక్ష్మీనారాయణశాస్త్రి సుప్రసిద్ధ నాట్య కళా విశారదుడు. భామా కలాపాన్నీ, గొల్ల కలాపాన్నీ, క్షేత్రయ్య పదాలనూ, తరంగాలనూ అభినయించడంలో దిట్ట. సంగీత నృత్య విద్యల్లోనే కాక, సంస్కృతాంధ్ర భాషల్లో చక్కని పాండితీ ప్రతిభ గడించినవారు.