పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/632

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెడల్పుగా ఒక మంచెను ఏర్పాటు చేస్తారు. ఇలా ఏర్పాటు చేసిన మానును "తపస్మాన్" గా పిలుస్తారు.

ఆర్జునుడు తపస్మాన్ ఎక్కే రోజు అనగానే చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు వేల సంఖ్యలో తెల్లవారు జామునే వచ్చి చేరుకుంటారు. అర్జునుడు తపస్మాన్ ఎక్కిన తరువాత, ఓ విల్లు ఆకారం కలిగిన వెడల్పాటి చత్రంలో కూర్చుని, నిమ్మ కాయలు, విభూతి, పళ్ళు, పూలూ నేల మీదికి వెదజల్లుతాడు. అర్జునుని తపస్మాన్నీ, ఎక్కడాన్నీ స్వర్గారోహణంగా అప్రజలు భావించి, పైనుంచి క్రింద పడే పళ్ళూ, పూలూ, ఎంతో పవిత్రమైనవిగా ఎంచి వాటిని అందుకోవడానికి జనం త్రొక్కిసలాడుతారు.

పిల్లలు లేని తల్లులు:

అంతే కాదు పిల్లలు లేని తల్లులు ఈ వుత్సవానికి హాజరవుతారు. తపస్మాన్ పై నుంచి పడే పళ్ళూ పూల కోసం తలారా స్నానం చేసి తడి బట్టలతో తపస్మాన్ క్రింది వేచి వుంటారు. అర్జనుడు మెట్టు మెట్టుకూ పాట పాడుకుంటూ, తీరిగా తపస్మాన్ ఎక్కేటంత సేపూ ఈ స్త్రీలు పడుకుని సాస్టాంగ దండ ప్రమాణం చేస్తూ తల ఎత్తకుండా అలాగే పడి వుంటారు. అర్జునుడు ప్రసాదాల్ని నేల మీదికి పడవేసే సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వారి వారి కొంగుల్ని సరిచేసుకొని, మోరలెత్తి ఎదురుచూస్తారు. ఆ పళ్ళూ, పూలు పడిన ముఖాలు ఎంతో వికసిస్తాయి. పడని ముఖాలు నిరుత్సాహ పడిపోతాయ. అంటే దీనిని బట్టి వీథి నాటక తపస్మాన్ ఎంత బలవత్తరమైనదో తెలుసుకోవచ్చును.

ఈ విధంగా మహాభారతం వీథి నాటక స్థాయి నుంచి జీవితంలోకి ఎలా ప్రవేశించిందో అర్థం చేసుకోవచ్చును.