పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాళుక్య చోళుల సొంపుపెంపులు

చాళుక్యరాజులు (32 మంది క్రీ.శ. 824 నుండి 1118 వరకు 500 సంవత్సరాలు ఆంధ్రదేశాన్ని నిరాఘాటంగా పరిపాలించారు. పూర్వ చాళుక్యుల్లో మొడటి చాళుక్య భీముడు క్రీ.శ. 910 ప్రాంతంలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతంమీద శివాలయాన్ని కట్టించి అందులో పార్థివేశ్వరస్వామిని ప్రతిష్టించాడు.

ఈ చాళుక్య భీమునికి లలిత కళల్లో అభిమానం ఎక్కువ. గాంధర్వ నాట్యవిద్యల్లో అభిరుచి ఎక్కువ. సమస్త గాందర్వ విద్యావిశారద యగు చల్లవ అనే వారవిలాసిని ఆయన ఆస్థానంలో వర్థిల్లింది. చల్లవ తండ్రి మల్లప్ప సంగీత శాస్త్రంలో ఆరితేరిన విద్వాంసుడు. ఆనాటి గాయక శిఖామణుల్లో మల్లప్ప తుంబురుడని ప్రఖ్యాతి వహించాడు.

చాళుక్యభీముని కాలంలో సంగీతంతో పాటు సాహిత్యంకూడ పెంపొందింది. భట్టవామనుడనే కవి ఈయన ఆస్థాన కవిగా వుండి కావ్యాలంకార సూత్రమనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించాడని కొందరు చరిత్రకారుల ఆభిప్రాయం.

కళ్యాణి చాళుక్యుల, కళా విన్యాసం:

క్రీస్తుశకం 1126 నుండి 1139 వరకు మూడవ సోమేశ్వరుడు (విక్రమాదిత్యుని కుమారుడు) భూలోకమల్ల బిరుదుతో 13 సంవత్సరాలు రాజ్య పాలన చేశాడు. ఈతడు సర్వజ్ఞ చక్రవర్తి అని బిరుదు పొందాడు. అభిలషితార్థ చింతామణి అనే సకల భారత విజ్ఞాన ఖనియైన గ్రంథాన్ని రచించాడు. ఈయన అనేక మంది కవులను పోషించాడు. జాయన సేనాని నృత్తరత్నావళిలో చాళుక్య సోమేశ్వరుడు ముందెప్పుడో కళ్యాణ కటకంలో భూతమాతృ మహోత్సవంలో 'భిల్లి' వేషం ధరించి, నృత్యగానాలు చేసే ఒక స్త్రీని చూసి మెచ్చుకున్నాడని, ఆ నృత్యమే గొండలి, లేక గొండగి అయి, తరువాత అదే గొండ్లి అయినదని వివరించాడు. మూడవ సోమే