పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/170

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
ఆనాటి మేళాలు:

ఆనాడు ఆంధ్రదేశంలో యక్షగాన ప్రదర్శనాల్లో పేరెన్నిక గన్న మేళాలు, సిద్ధేంద్ర యోగి మేళం. భాగవతుల దశరథరామయ్య గారి మేళం, 18 వ శతాబ్దంలోని భాగవతుల బుబ్బుగాని మేళం, 19 వ శతాబ్దం లో రాయలసీమలో లేపాక్షి, వేములపల్లి, తాడిపాత్రి మేళాలు, నెల్లూరు మండలంలో ఎడకండ్ల రామస్వామిరాయ కవి, త్వరకవి రామకృష్ణయ్యగారి మేళాలు విశాఖ మండలంలో నరసింగపల్లి, కళేపల్లి, కందాళ,చిదంబరకవి మేళాలు మొదలైనవి బహు ప్రసిద్ధి పొందాయి.

ఆనాటి ప్రాముఖ్యమూ అందుకు దాఖలాలు:

యక్షగాన కళారూపం ఆనాడు ఎంతటి ప్రాముఖ్యం వహించిందో ఈ క్రింది వివరాలు మనకు తెలియజేస్తాయి.

ఆంధ్ర ప్రాంతంలో యక్షగానాలను రచించిన కవులు 174 మంది.
దక్షిణదేశపు యక్షగాన కవులు 36 మంది
తెలంగాణ యక్షగాన కవులు 47 మంది
పరిశిష్టాలు రచించిన కవులు 65 మంది
అనుబంధాలు రచించినవారు 140 మంది

అందరూ కలిపి 465 మంది కవులు యక్షగాన వాఙ్మయానికి కృషి చేశారు.

ఈనాడు లభ్యమయ్యే యక్షగానాలు 542. అలభ్య యక్షగానాలు 260. మొత్తం 802. యక్షగానాలు వెలువడ్డాయి. ఈ విధంగా యక్షగాన వాజ్యయం దక్షిణదేశంలో ధారావాహికంగా వెలుగొందింది. వీటిలో 19 పారిజాతాలు, 28 భామాకలాపాలు, 14 గొల్ల కలాపాలు, 21 కొరంజులు వెలువడ్డాయని యస్వీ జోగారావు గారు తమ "యక్షగాన వాజ్మయ చరిత్ర" రచనలో వివరించారు. యక్షగాన వాఙ్మయ చరిత్ర ద్వారా జోగా రావు గారు అమూల్యమైన సమాచారాన్ని అందజేశారు.