పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రమణాచారి, 36 సంవత్సరాల నుంచీ కంటిచూపు దూరమైనా పట్టుదలను వీడక రచనను సాగిస్తూనే వచ్చారు.

తెలంగాణాలో అత్యధిక యక్షగానాలను రచించిన వారు చెర్విరాల భాగయ్యగారు. ఆయన 40 యక్షగానాలను రచించారు. ఆయన యక్షగానాలు విరివిగా ప్రదర్శించబడ్డాయి కూడా. కాని వంద యక్షగానాలను వ్రాసిన రమణాచారు యక్షగానాలు, రెండు మూడు తప్ప ముద్రణకు నోచుకోలేదు, కాని విరివిగా ప్రదర్శింపబడ్డాయి. ప్రదర్శనానికి వచ్చిన డబ్బు వారి జీవనాధారానికి సరిపోయింది. భారత, భాగవత, రామాయణాలకు సంబంధించిన గాథలే ఆయనకు యక్షగానాలకు ఇతి వృత్తం.

వీరి యక్షగానాలన్నీ స్థానిక తెలుగు లెక్చరర్ దాశరథుల బాలయ్య వద్ద భద్రపరిచారు. ఉన్నత సాహిత్య విలువలన్నీ, రమణాచారి యక్షగానాల్లో వున్నవంటారు బాలయ్య. ఆయనకు కళ్ళు కనిపించక పోయినా వెంకటేశం అనే తన బంధువుకు చెప్పి వ్రాయించాడు.

ఈనాటికీ రమణాచారి యక్షగానాలు ఒక్క మెదక్ జిల్లాలోనే కాక, వివిధ జిల్లాలలో ప్రదర్శింప బడుతున్నాయి. ఆయన యక్షగానాలు పల్లె ప్రజలకు అర్థమయ్యే భాషలో రచియించటం ఎంతో గొప్ప విషయం.

కొన్ని అంశాలను వాస్తవానికి దగ్గరగా వుండే టట్లు ప్రదర్శిస్తామని ఉదాహరణకు అశోకవనంలోని సీతాదేవి శోకిస్తున్న ఘట్టం - సహజత్వానికి దగ్గరగా వుండేందుకు ప్రదర్శనా స్థలంలో వున్న చెట్టుక్రిందే సీతా దేవిని కూర్చుండ బెట్టే వారమని 'న్యూస్ టుడే ' కి వెల్లడించారు.

అవి అవే ఇవి ఇవే:

ఆ నాడు కూచిపూడి భాగవతులు ఊరూరా తిరుగుతూ డేశసంచారం చేయడం వలన ఉత్సాహం పొందిన కళా ప్రియులైన అనేక మంది ఏనాదులు, గొల్లలు, మాలలు మొదలైన వారందరూ యక్షగానాలను ప్రదర్శిస్తూ వచ్చారు. కట్టుదిట్టమైన కూచిపూడి వారు యక్షగానాలకూ, ఇతరులు ప్రదర్శించే యక్షగానాలకు సారూప్యం లేదు. కూచిపూడి సంప్రదాయం కంటే వారి ప్రదర్శనాల స్థాయి తక్కువ.