పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/114

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కనుకనే దానికి అచ్యుతాపురమనే పేరు వచ్చింది. దీనినే తరువాత మేరటూరని, మెలట్టూరని, మేలటూరని వ్వవహరించారు. కాని ఈ నాటికి తంజావూరు చుట్టు పక్కలవారు మేరటూరనే పిలుస్తున్నారు.

మేలటూరు భాగవతులు:

ఆంధ్రదేశంలో కూచిపూడి వీధి భాగవతుల మాదిరే దక్షిణాదిన తంజావూరు జిల్లాలో మేలటూరు, వూర్తుకూడి, శూలమంగళం గ్రామలలో కూడ భాగవత మేళముల వారున్నారు. ఆంధ్ర రాజుల తంజావూరును పరిపాలించే కాలంలో కూచిపూడి భాగవతుల నానారాజ సందర్శనం చేస్తూ, తంజావూరు ఆంధ్రరాజులను కూడ ఆశ్రయించారు.

విజయనగర సామ్రాజ్యంలో కవులు, పండితులు, కళాకారులు అనేకమంది పోషించబడ్డారు. కాని తళ్ళికోట యుద్ధానంతరం రాయల సామ్రాజ్యం అంతరించడంతో ఈ కళాకారులందరూ కుటుంబాలు కుంటుంబాలుగా చెల్లా చెదురై అనేక మంది అనేక ప్రాంతాలకు వలస పోయారు. అలా వలస పోయిన వారిలో చాలమంది తంజావూరు చుట్టుప్రక్కల స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాడు తంజావూరు రాజులు కూడ వీరిని ఆదరించి మాన్యాలూ, ఆగ్రహారాలు వ్రాసి యిచ్చారు. అలా సంపాదించిందే ఈ నాటి మేలటూరు.

అపర సిద్దేంద్రయోగి:

మహామహుడు సిద్ధేంద్రయోగి కూచిపూడి భాగవతులకు ఎలాంటి వాడో మేలటూరు భాగవతులకు వెంకటరామ శాస్త్రి అలాంటివారు. ఈయన 17 వ శతాబ్దంలో ఆంధ్ర దేశం, గోదావరి ప్రాంతం నుంచి దక్షిణదేశానికి వెళ్ళినట్లు ఆధారాలున్నాయి. ఈయన రచించిన వీథి నాటకాలు చూస్తే ఈయన కృషి, ప్రతిభ ఎలాంటిదో మనకు బోధపడుతుంది.

వీరి రచనలు: ఉషాపరిణయం., హరిశ్చంద్ర, ప్రహ్లద, రుక్మాంగద చరిత్ర, సీతాకల్యాణం, సత్సంగరాజు, రుక్మిణీ కల్యాణం, కంస వధ మొదలైనవి.