పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నత స్థానాన్ని అలంకరించాయి. ఆ నాటికీ ఈ నాటికీ ఆ మహావైభోగానికి సాక్ష్యాధారాలుగా అవి తంజావూరులో మనకు దర్శనిమిస్తున్నాయి.

కవి, పండిత పోషణలో ఘనాపాఠి:

రఘునాథనాయకుడు క్రీ.శ. 1600 నుండి 1634 వరకూ రాజ్యాన్ని పరి పాలించాడు. ఈయనకు దాన కర్ణుడనే పేరు కూడా వుంది. గోవింద దీక్షితుడు ఈయనకు మంత్రి. ఈయన కర్ణాటక సంగీత శాస్త్రంలో బహుముఖ ప్రజ్ఞాశాలి. అనేక రాగాలను, తాళాలను ఈయన స్వయంగా కల్పన చేశాడు. రఘునాథ నాయకుని ఆస్థానంలో కవులు, పండితులు బహు బాగా పోషింప బడ్డారు. ఈయన ఆస్థానంలో ముద్దు చంద్ర రేఖ అనే రాజ నర్తకి వుండేదట. గోవింద దీక్షితుని ఇరువురు పుత్రులైన భాస్కర దీక్షితుడు, రాజా చూడామణి దీక్షితుడూ లక్ష్మీకుమార తాతాచార్యులూ నృత్య, గాన విద్యల్లో ఆరితేరిన దిట్టలు. రామభద్రాంబ మొదలైన వారందరూ రఘునాథుని ఆస్థానం అలంకరించిన వారే. ఆయన ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో యక్షగానాలు నాటక రూపంలో ప్రదర్శింపబడ్డాయి.

సంగీత సాహిత్యదోహదంలో విజయరాఘవుని వితరణ:

రఘునాథనాయకుని అనంతరం విజయరాఘవ నాయకుడు రాజ్యానికి వచ్చి 1663 నుంది 1673 వరకూ పరిపాలించాడు. రఘునాథనాయకుని వలెనే ఈయన కూడ సంగీత, సాహిత్య నాట్యకళలను పోషించాడు. మువ్వ గోపాల పద కర్తయైన క్షేత్రయ్య విజయ రాఘవ నాయకుని ఆస్థానంలో చాల సన్మానాలందుకున్నాడు. ఈ క్షేత్రయ్య పదాలు ఈ నాటికి దక్షిణాపథ మంతటా బాగా ప్రచారంలో వున్నాయి. ఇంకా కళాకారులైన పురుషోత్తమ దీక్షితుడు, పసుపులేటి రంగాజమ్మ, కోనేటి దీక్షితుడు, కావరసు వెంకటపతి సోమయాజి, మన్నారుదేవుడు, మొదలైన వారెందరో యక్షగాన రచయితలుగాను, ప్రదర్శకులుగాను ప్రసిద్ధి పొందారు.