పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/383

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

370

స్వీయ చరిత్రము.



చెప్పివేయఁగా, ఆయన వెనుకకు జరపి మేడను తమస్థలములోనే కట్టుకొనిరి. సభవారి యనుమతినిపొంది నాయఁడుగారిప్పు డాస్థలములో మేడముందు పందిరి వేసికొనియున్నారు. న్యాయవిషయమున మొగమోటపడక మిత్రుని మాటనైనను నేను నిరాకరించుచుండెడివాఁడను.

నాగోజీరావు పంతులుగారు పాఠశాలల పరీక్షకులయి రాజమహేంద్రవరము విడిచి నప్పుడప్పటి యుపకరగ్రాహి (Sub-Collector) యయిన హామ్నెట్టు దొరగారు పారిశుద్ధ్య సంఘాధ్యక్షత్వమునకై ప్రయత్నించిరి. మాశాస్త్ర పాఠశాలలో ప్రధానోపాధ్యాయులైన మెట్కాపు దొరగారును ద్వితీయోపాధ్యాయులైన సుందరరావుగారును, నేనును ముగ్గురము పారిశుద్ధ్య, విచారణ సంఘములో సభ్యులముగా నుండెడివారము. కొంచెము కాలముక్రిందట నిన్నీసుపేట పాఠశాలలోనిచ్చిన యొక యుపన్యాసమునందు సుందరరావుగారు యూరపియనులను మిక్కిలి నిరసించుచు మాటాడిరి. అందుచేత నాతఁడు యూరపియనులను లక్ష్యముచేయని స్వతంత్ర బుద్ధిగలవాఁడని నేను భావించియుంటిని. ఒకనాఁడు మెట్కాపు దొరగారు పారిశుద్ధ్య విచారణ సంఘాధ్యక్షత్వమునకు హామ్నెట్టుగారి పేరు నిర్దేశించుచు నొక కాగితమువ్రాసి దాని కనుమోదించి క్రింద వ్రాలుచేయుటకయి నాయొద్దకు తీసికొనివచ్చిరి దొరతనమువారు స్థానిక స్వప్రభుత్వము నిచ్చుటవలని ప్రయోజనము సభ్యులు స్వతంత్రముగా పనిచేయుటకొఱకనియు, దండనాధికారము గలవా రధ్యక్షులయినప్పుడు సభ్యులు స్వతంత్రులయి నిర్భయముగా వర్తించుట పొసఁగదనియు, అందుచేత సభ్యులు దండనాధికారము లేనివారినె యధ్యక్షునిగా కోరుకొనుట నాయభిమతమనియు, కాఁబట్టి నేనిందులో వ్రాలుచేయక పోవుటయేకాక నియామక దినమునందు నేను వ్యతిరేకముగా మాటాడెదననియు, చెప్పితిని. నేనన్నమాట తిరుగువాఁడను కానని యెఱిఁగినవారయి నన్ను విడిచి దొరగారు కాగితమును సుందరరావుగారి యొద్దకు తీసికొనిపోఁగా, ఆయన తన స్వాతంత్ర్యమును విడనాడి మాఱుమాటాడక వెంటనే దానిమీఁద వ్రాలుచేసెను. అధ్యక్షుని నియమించుకొను దినమువచ్చి