పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాబుద్ధులు గరిపించారు. 1936లో ఒకే నెలలో బీద విద్యార్థులు చదువుకు 1500 రూపాయలు అందజేశారు.

నాయుడుగారు "పీపుల్స్ ఫ్రెండ్, ఫెలో వర్కర్స్" అను ఆంగ్ల పత్రికలకు సంపాదకత్వం వహించి సాంఘిక సమస్యల మీద ఉత్తేజకరమైన వ్యాసాలు వ్రాశాడు.

అస్పృశ్యతా నివారణ కోసం ఉద్యమాన్నే నిర్వహించారు. బ్రహ్మ సమాజ సిద్ధాంతాలలో ప్రముఖులైన కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తూ, వర్ణాంతర వివాహాలను జరిపించారు.

ఆనాడు ఆంధ్ర దేశంలో ప్రబలంగా వున్న ' వేశ్యావృత్తి ' నిర్మూలనకు గొప్పగా కృషి చేశారు. శుభ కార్యాలలో విధిగా ఏర్పాటు చేస్తూ వుండిన భోగము మేళములను అంతరింపజేశారు. కళావంతుల సంఘములను స్థాపించి వేశ్యావృత్తి నిషేధానికి ముమ్మరంగా కృషి చేశారు. వారి కృషి వల్లనే ప్రభుత్వం వేశ్యావృత్తిని నిషేధించే చట్టాన్ని అమలు పరచింది.

మద్య నిషేధ ఉద్యమం సాగించారు. 1923లో మద్రాసు రాష్ట్ర శాసన మండలి సభ్యులుగా వున్నపుడు మద్య నిషేధం బిల్లు ప్రవేశపెట్టనందుకు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

నేటి జీవన విధానంలో సమాజంలోని ఇతర వ్యక్తుల కంటే ఉపాధ్యాయుడు ఎక్కువ చైతన్య వంతుడు కావాలని, ఉపాధ్యాయులు ' విమోచన సేన ' గా ఉద్యమించాలని ఉద్బోధించేవారు.

సాంఘిక పవిత్రతా సంఘం నెలకొల్పి ఆ సంఘ సభ్యులకు క్రింది నియమాలను విధించారు.

1) వేశ్యలు పాల్గొను సమావేశాలకు వెళ్ళరాదు. వారిని ప్రోత్సహించరాదు. అశ్లీలమైన పాటలను పాడటం, వినటం సాహిత్య పఠనం చేయరాదు. శారీరక, మానసిక పవిత్రత్వాన్ని పెంపొందించుటకు కృషి చేయాలి.

ఈ విధంగా యువతలో శీల సంపదను పెంపొందించుటకు కృషి చేశారు. తమ నెలసరి ఆదాయంలో సొంతఖర్చులకు అతి స్వల్పంగా వుంచుకొని బీద విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందచేసేవారు. తమ గురుదేవులైన డా. మిల్లర్ పేర మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రతి ఏటా విజ్ఞాన ప్రచారానికి పదివేల రూపాయల నిధిని ఏర్పాటు చేశారు.

'అపర సోక్రటీసు' గా ఆంధ్ర ప్రజల మన్ననలందుకున్న రఘుపతి వెంకట రత్నం నాయుడుగారు సంపూర్ణ జీవితం గడిపి 1939 మే 26వ తేదీన దివంగతులయ్యారు.