పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనసంతా శాస్త్రపరిశోధనపట్ల వుండేది.

ఒకనాడు కలకత్తా వీధిలో ట్రామ్‌బండిలో ప్రయాణం చేస్తుండగా "ది ఇండియన్ అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్" అను బోర్డు అతని కంటపడింది. వెంటనే ట్రామ్ బండి దిగి, ఆ భవనం ప్రవేశించాడు. శాస్త్రవేత్తలు సమావేశం ముగించి వెళుతున్నారు. ఆ సంస్థ కార్యదర్శి మహేంద్రలాల్ సర్కార్‌ను కలుసుకున్నాడు. మరుసటి దినం నియమిత కాలంలో ఇరువురు సమావేశమయ్యారు. రామన్ తన పరిశోధనలను మహేంద్రలాల్ సర్కార్‌కు వివరంగా చూపించాడు. రామన్ ప్రతిభకు నివ్వెరపోయిన సర్కార్, రామన్‌కు తమ సంస్థలో ప్రవేశం కల్పించి నిరాఘాటంగా, స్వతంత్రంగా ప్రయోగములు సాగించుటకు ప్రత్యేక సౌకర్యములు కల్పించాడు. రామన్ రాకతో సంస్థ ప్రతిష్ట బాగా పెరిగింది. కలకత్తా విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడైన అశుతోష్ ముఖర్జీ రామన్‌ను ఎంతో ఆదరించాడు.

రామన్‌ను ప్రభుత్వం రంగూన్‌కు బదిలీ చేసింది. రంగూన్‌లో ఉన్నపుడే తండ్రి మరణించాడు. ఆరు నెలలు సెలవు పెట్టి మద్రాసు వచ్చిన రామన్ ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రయోగాలు చేయసాగాడు. నాగ్‌పూర్‌కు బదిలీ అయ్యాడు. అక్కడ సహోద్యోగుల ఈర్ష్యాసూయలతో భాదపడినాడు. మరల కలకత్తా బదిలీ కావడం రామన్ కెంతో ఆనందం కలిగించింది.

కలకత్తా విశ్వవిద్యాలయమున భౌతిక శాస్త్రంలో ఆచార్య పీఠం 1915లో నెలకొల్పబడింది. అందుకు భూరివిరాళమిచ్చిన సర్ తారకనాథ్ పాలిట్ దృష్టి రామన్ పై పడింది, ఇంగ్లండులో పెద్ద చదువులు నేర్చివచ్చినవారే ఆపదవికి అర్హులని పేర్కొనబడింది. కాని వైస్ ఛాన్స్‌లర్ అశుతోష్ ముఖర్జీ, అన్ని నిబంధనలను సడలించి సి.వి.రామన్‌ను ఆ పదవికి ఎన్నుకొన్నాడు. ప్రభుత్వంలోని ఉన్నత పదవికి వెంటనే రాజీనామా ఇచ్చిన రామన్ కలకత్తా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా చేరాడు. 1919 లో రామన్ 'ఇండియన్ ఆసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్సు' సంస్థకు కార్యదర్శిగా ఎన్నుకోబడినాడు. 1922 బ్రిటిష్ యూనివర్శిటీ కాంగ్రెస్ సభలో భారతదేశ ప్రతినిధిగా ఎన్నుకోబడినాడు. 1924లో కెనడాలోని 'సైన్స్ కాంగ్రెసు' కు విశేష ప్రతినిధిగా వెళ్ళి విదేశాలలో పలుచోట్ల ఉపన్యాసాలిచ్చాడు. అపూర్వంగా, రాయల్ సొసైటీ, రామన్‌కు 1924లో ఫెలోషిప్ సత్కారమిచ్చి గౌరవించింది. 1924లోనే రామన్ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సంస్థను నెలకొల్పాడు. 1925లో రష్యన్ సైన్స్ అకాడమి ఆహ్వానంపై మాస్కో వెళ్ళాడు.

కొన్నేళ్ళు, నిరంతర పరిశోధనా ఫలితంగా 1928లో "రామన్ ఎఫెక్ట్"ను కనుక్కొన్న, సి.వి.రామన్‌కు నోబెల్ బహుమతి లభించింది. ఆసియా ఖండంపై ఆ సత్కారం అందుకొన్న శాస్త్రవేత్తలలో మొట్టమొదటివాడు సి.వి.రామన్.

15 సంవత్సరాలు కలకత్తా విశ్వవిద్యాలయంలో, అపూర్వంగా పనిచేసిన సి.వి.రామన్ బెంగుళూరులోని 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్' సంస్థ డైరెక్టర్‌గా