పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశాడు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

"మీరు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ తీసుకుని వుంటే మీకు మరింత గొప్ప పేరు వచ్చేది" అన్నాడొక మిత్రుడు. అందుకు బదులుగా, డా. రాధాకృష్ణన్ "నేను ఆక్స్‌ఫర్డ్ వెళ్తే, అధ్యాపకుడిగా మాత్రమే వెళ్తాను. కాని విద్యార్ధిగా మాత్రం వెళ్ళను" అన్నాడు. అలా అన్న ఆరేళ్ళ తర్వాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం వారి ఆహ్వానంపై, ప్రాచ్య తత్వశాస్త్రంపై ఉపన్యాసాలిచ్చేందుకు వెళ్ళారు. ఇంగ్లండ్, ఫ్రాన్స్, అమెరికాలలో పలుచోట్ల ఉపన్యాసములిచ్చి మాతృదేశం వచ్చారు.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగష్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్.

డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

రచనలు

ముఖ్యమైన ఉపనిషత్తులు, ఈస్ట్ అండ్ వెస్ట్ సమ్-రెఫ్లెక్షన్, రికవరీ ఆఫ్ ఫేత్, ఎ సోర్స్ బుక్ ఇన్ ఇండియన్ ఫిలాసఫి, కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ వంటి చాలా గొప్ప గ్రంథాలు రచించినారు.

1962లో బాబూ రాజేంద్రప్రసాద్ రాష్ట్రపతి పదవి నుండి విరమించుకున్నారు. వారి తర్వాత రాష్ట్రపతిగా ఉన్న డా. రాధాకృష్ణన్ అయిదేళ్ళ కాలంలో ఎన్నో దేశాల్లో పర్యటించారు. అసమాన వాగ్ధాటితో, ప్రాచ్య పాశ్చాత్వ తత్వశాస్త్రాలపై చేసిన ఉపన్యాసాలు అన్ని దేశాల వారిని ఆశ్చర్యపరిచాయి.

ఛలోక్తులు

ఆయన ఉపన్యాసాల్లో ఛలోక్తులు, హాస్యోక్తులు దొర్లేవి. ఒకసారి సర్. మహమద్ ఉస్మాన్ (ఒకప్పుడు మద్రాసు రాష్ట్రమంత్రి) డా.రాధాకృష్ణన్ ఒకే సభలో మాట్లాడారు. సర్ మహమద్ ఉస్మాన్‌ను గురించి మాట్లాడుతూ, "శ్రీ ఉస్మాన్ నాకు