పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాలా సన్నిహిత మిత్రుడు. ఆయన కాలేజీలో మొదట సీనియర్. ఆ తర్వాత నా క్లాస్‌మేట్. తర్వాత నా జూనియర్. నేను మద్రాసులో ప్రొఫెసర్‌గా వున్నప్పుడు ఆయన అదే యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్. నేను వైస్ ఛాన్స్‌లర్‌గా వుండినపుడు ఆయన ఛాన్స్‌లర్."

రాధాకృష్ణన్, మానవజీవితంలో మంచిని పెంచాలనీ, ఉత్తమ సమాజాన్ని రూపొందించాలని, మతాన్ని సరిగా అర్థం చేసుకోవాలని బోధించారు. మానవుల్లోని మమతానురాగాలను పెంచుటకు ప్రపంచం కృషి చేయాలన్నారు. అహింసా విధానం ద్వారా ప్రపంచ దేశాలన్నీ శాంతిని పెంచాలన్నారు.

ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు వారిని గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. 1969లో భారత ప్రభుత్వం వారిని 'భారతరత్న' తో సత్కరించింది. 1975లో 'టెంపుల్ టన్' బహుమతి ద్వారా లభించిన 96 వేల డాలర్ల మొత్తాన్ని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ సంస్కృతిపై ప్రసంగాలు ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. రాధాకృష్ణన్ గారు, డా. కె. యం మున్షీగారితో కలిసి భారతీయ విద్యాభవన్ స్థాపించారు.

మహామేధావిగా, గొప్పవ్యక్తిగా, గొప్ప గ్రంథకర్తగా, తత్వవేత్తగా, ప్రపంచ దేశాల మన్ననలందుకున్న డా. రాధాకృష్ణన్ భారతీయ మహర్షులకోవకు చెందిన వారు.

రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత (1967) చివరిరోజు వరకు మద్రాసులోని తమ భవనంలో, తాత్విక చింతన చేస్తూ 17.4.1975న పరమపదించారు.

ఆచార్యునిగా ఆయనను గుర్తించిన భారత దేశం, రాధాకృష్ణన్ జన్మదినమును ఉపాధ్యాయదినంగా దేశమంతటా ఏటా జరుపుకోవడం ఎంతో సముచితం.