పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సమావేశాన్ని వివరిస్తూ రాధాకృష్ణన్ ఇలా వ్రాశారు.

"మా సంభాషణలో అశోక చక్రవర్తి ప్రస్తావన వచ్చింది. ఆయన పెక్కు యుద్ధాలు చేశాడని, వేలాది ప్రజలను చంపి యుద్ధంలో విజయం సాధించాడని, చివరకు ఆ మహారాజు సన్యాసిగా మారిపోయాడు అంటూ కళింగ యుద్ధం గురించి చెప్పాను. అశోకుని పరిస్థితి మీకూ కలగవచ్చు అన్నాను. అందుకు స్టాలిన్, 'అవును అద్భుత సంఘటనలు సంభవిస్తాయి' అన్నాడు. సమావేశం చివర నేను స్టాలిన్ చెక్కిళ్ళను నిమిరి వీపుపై తట్టాను. ఆయన తలపై నా చేతిని ఆడించాను. అప్పుడు స్టాలిన్

"అయ్యా, నన్ను రాక్షసునిగాకాక, మనిషిగా గుర్తించిన వారు మీరొక్కరే. మీరు త్వరలోనే స్వదేశానికి తిరిగి వెళుతున్నట్లు విన్నాను. అందుకు విచారిస్తున్నాను. నేను ఇక ఎంతోకాలం బ్రతకను." అన్నాడు. తర్వాత ఆరు నెలలకే చనిపోయాడు స్టాలిన్.

గాంధీజీ హత్యకు గురి అయ్యే కొద్ది రోజులముందు రాధాకృష్ణన్ గాంధీజీని కలుసుకున్నారు. తాను రచించిన 'భగవద్గీత' ఆంగ్లానువాదాన్ని గాంధీకి అంకితం చేయదలచినట్లు చెప్పారు రాధాకృష్ణన్. అందుకు గాంధీజీ సమాధానమిస్తూ "మీ రచనలు చాలా గొప్పవి. కానీ నా అభిప్రాయం వినండి. నేను, మీ అర్జునుణ్ణి. మీరు నా కృష్ణభగవాన్ " అన్నాడు గాంధీజీ. ఇలా మహాత్ముని మన్ననలందుకున్న మహాపండితుడు, రాధాకృష్ణన్.

జననం - విద్యాభ్యాసం

శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ 5-9-1888న మద్రాసుకు 40 మైళ్ళ దూరంలోని తిరుత్తణి లో జన్మించారు. తండ్రి వీరాస్వామయ్య. ఒక జమీందారీలో తహసిల్దార్. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందాడు. బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. విద్యార్ధిగా వున్నపుడు, మనస్తత్వశాస్త్రంపై చేసిన ఉపన్యాసాలు అందరినీ అలరించేవి.

21 సంవత్సరాలైనా దాటని వయసులో ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం అతనిని ప్రొఫెసర్ గా నియమించింది. ఆయన ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. కలకత్తా వెళ్ళాలని నిశ్చయించుకున్నారు రాధాకృష్ణన్. ఆయన ఇంటిముందు గుర్రపుబండి సిద్ధంగా ఉంది. తమ అధ్యాపకునికి వీడ్కోలు చెప్పటానికై విద్యార్థులు ఆయన ఇంటికి వచ్చారు. బండికి కట్టిన గుర్రాలను వదిలించారు. రైల్వే స్టేషన్ దాకా బండిని తామే లాక్కొని వెళ్ళారు. అది విద్యార్ధులకు ఆయన పట్ల వున్న ప్రేమకు సంకేతం. విద్యార్ధుల భక్తిశ్రద్ధలను గమనించిన రాధాకృష్ణన్ కళ్ళు చెమ్మగిల్లాయి. అది గురుశిష్యుల హృదయానుబంధం. ఆ ప్రేమానుబంధం ఈనాడు అంతగా కానరాదు.

కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు ఆయన 'భారతీయ