పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జాతి గర్వించదగ్గ మహామేధావి

డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్

అది 1952 ఏప్రిల్ 5వ తేదీ. మాస్కో నగరం. రష్యా అధినేత స్టాలిన్ నుండి భారత రాయబారి కార్యాలయానికి ఒక లేఖ అందింది. భారత రాయబారి, డా.రాధాకృష్ణన్ గారిని ఆహ్వానిస్తూ స్టాలిన్ వ్రాసిన లేఖ అది. అందరికీ ఆశ్చర్యం కల్గించింది. సాధారణంగా స్టాలిన్ విదేశీ రాయబారులను చూచేవాడు కాదు. అదివరలో శ్రీమతి విజయలక్ష్మి పండిట్ 18 మాసాల పాటు రష్యాలో భారత రాయబారిణిగా పనిచేశారు. కాని ఆమెకు రష్యా అధినేత మార్షల్ స్టాలిన్ తో ఇంటర్వ్యూ లభించలేదు.

రాధాకృష్ణన్ తత్వవేత్త. చాలా సౌమ్యుడు. రాజకీయాలు, దౌత్యవ్యవహారాలతో ఆయనకు అంతగా పరిచయం లేదు. స్టాలిన్ ను చూద్దామా అతి క్రూరుడని, అతని తత్వానికి రాధాకృష్ణన్ కు ఏమాత్రం పడదని అందరూ అన్నారు. రాయబారిగా రష్యా వచ్చిన రాధాకృష్ణన్ రోజుకు పద్దెనిమిది గంటలు పుస్తకాలు చదవటం, వ్రాయటంలో గడుపుతుంటాడని విన్నాడు స్టాలిన్.

ఆహ్వానం అందుకున్న డా. రాధాకృష్ణన్ రాయబార కార్యాలయోద్యోగి రాజేశ్వర్ దయాళ్ తో పాటు స్టాలిన్ వున్న గదిలో ప్రవేశించారు. రష్యా విదేశాంగమంత్రి విటాన్‌స్కీ స్టాలిన్ ప్రక్కనే ఉన్నారు. పావ్‌లోవ్ దుబాసిగా ఉన్నాడు. ఆ