పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జవహర్ లాల్ నెహ్రూ, ఆచార్య కుపలాని మాత్రం వచ్చారు.

కేంద్ర సంక్షేమ సంఘం అధ్యక్షురాలుగ ఆమె అవిశ్రాంతంగ కృషి చేశారు. 1957లో డా. దేశ్‌ముఖ్ ఆర్ధిక శాఖ పంత్రి పదవికి రాజీనామా చేసి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛేర్మన్ గా నెలకు ఒక రూపాయి వేతనంతో మూడేళ్ళు పని చేశారు. అప్పట్లోనే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ప్రపంచ ఆర్ధిక సంస్థ) డైరెక్టర్ జనరల్ గా, డా. దేశ్‌ముఖ్ గారిని ఆహ్వానించారు. ప్రధాని నెహ్రూ, ఆ పదవిని స్వీకరించడం భారతదేశానికి గర్వకారణం కాగలదన్నారు. ఏడాదికి 30 వేల డాలర్ల వేతనం, ఇతర వసతులన్నీ కల్పిస్తామన్నారు. డా. దేశ్‌ముఖ్ దుర్గాబాయి గారి సలహా కోరగా, 'అంత డబ్బు మనకెందుకు? మన దేశపు ప్రజల సేవ చేద్దాం. ఆ పదవి వద్దు' అన్నారు దుర్గాబాయి. అంత పదవిని సంతోషంగా వదులుకున్నారా దంపతులు.

1967లో దేశ్‌ముఖ్ దంపతులు ఢిల్లీ వదలి హైదరాబాదులో స్థిరపడినారు. తమ ఇంటికి "రచన" అని పేరు పెట్టుకున్నారు.

ఆంధ్ర మహిళా సభ కార్యక్రమాలు మూడు పూవులారుకాయలుగా విస్తరించాయి. నర్సింగ్ హోం, ఆర్థోపెడిక్ సెంటర్, శిశు విహార్, నర్సెస్ హాస్టల్ మరెన్నో వైద్యశాల భవనాలు ఆమె సేకరించిన విరాళాలతో వెలిశాయి. దాదాపు 23 సంస్థలకు ముాలకారకురాలు.

దేశ్‌ముఖ్ దంపతులు తమ ఆస్తిపాస్తులన్నిటినీ సేవా సంస్థల స్థాపనకు విరాళంగా ఇచ్చారు. 26 ఏళ్ళ దాంపత్య జీవితం సేవా మయంగా సాగింది.

నిరంతర పరిశ్రమ, కార్యదీక్ష, పట్టుదల, నిజాయితీ అన్నీ మూర్తీభవించిన మహిళామణి దుర్గాబాయి.

1971లో ఆమె వయోజన విద్యావ్యాప్తికి చేసిన కృషికి 'నెహ్రూ లిటరసీ' అవార్డు ఇచ్చి సత్కరించింది భారత ప్రభుత్వం.

1975 జనవరి 26న ఆమెను 'పద్మవిభూషణ' తో ప్రభుత్వం సత్కరించింది.

లాయరుగా జమీందారుల కేసులన్నీ కోర్టులో వాదించి, గెలిచి వారినుంచి తీసుకున్న ఫీజుల మొత్తమును ఆంధ్ర మహిళా సభకు ఇచ్చిన త్యాగమూర్తి శ్రీమతి దుర్గాబాయి.

'స్వతంత్ర పత్రిక' లో ఖాసా సుబ్బారావు గారు ఇలా వ్రాశారు.

"దుర్గాబాయి విసుగు విరామం లేని మనిషి, తన సహచరులను కూడా తనలాగే విరామమెరుగని సేవాతత్పరులుగా ఆవేశపూరితులుగా చేయగల నాయకురాలామె. జీవితంలో ఓటమి వుంటుందేమో అన్న భయం ఆమెకు లేదు... సహారా ఎడారిలో కూడా ఆమెకు చేయటానికి ఏదో సేవాకార్యక్రమం కనిపిస్తుంది."

సామాన్య వ్యక్తిగా కాక మహోన్నత వ్యవస్థగా దేశ ప్రజలకు సేవలందించిన దుర్గాబాయి గారు 1981 మే 9వ తేదీన కన్నుమూశారు.