నకు దు:ఖ మాగక మనసులోనుండి పొరలిపొరలి రాసాగెను. కాఁబట్టి కొంతసే పాతడు మాటాడుటకును కదలుటకును శక్తుడుగాక చిత్రపుప్రతిమవలె నిలువఁబడి యుండెను.
మిత్రవింద యప్పుడు రాజున కభిముఖురాలయి "మహా ప్రభూ! మీరు నిశ్చేష్టులయి యుండుట చూడఁ బనివాని శిల్పకళాకౌశల్యమున కత్యద్భుత పడుచున్నట్టు కనుపట్టు చున్నారుగాన నేను మిక్కిలి ప్రమోదించుచున్నాను. ఈ విగ్రహము కేవలము శ్రీ రాజ్ఞిగారివలె నుండలేదా ?" అని యడిగెను. రాజును తుదకు హృదయము పదిలపఱచుకొని, "నిస్సందేహముగా నేను మొట్టమొదట నామెను వరించినప్పు డేప్రకారముగా నున్నదో యిప్పుడు నదేప్రకారము గంభీరముగా నిలుచున్నది. కాని మంజువాణి నిజముగా నీవిగ్రహము కనుపట్టునంతవయస్సు చెల్లినదికాదు" అని చెప్పెను. "అట్లయినచో మంజువాణి యిప్పటివఱకును జీవించియుండిన నిప్పు డేరీతి నుండునో యారీతినే విగ్రహమును సిద్ధముచేసిన పనివాని యొక్క నేర్పును మనము మఱింత మెచ్చుకోవలసియున్నది. దేవరవారు చూడగా జూడగా విగ్రహము కదలుచున్నదని కూడ భ్రమంతురేమో యని భయమగుచున్నది. ఇక తెర వేయనిండు" అని మిత్రవింద మరల బలికెను. "తెర వేయబోకు బహుమానుఁడా ! చూడు -- నీకది శ్వాసము నిడుచు చున్నట్టు కనఁబడలేదా? దాని కనురెప్పయందు చలన