పుట:Sringara-Malhana-Charitra.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కృతిరచనాకాలము

కవి తా నీప్రబంధమును శ్రీకృష్ణదేవరాయలకాలముననే రచియించి యాతని కేకారణముననో యంకితము సేయక యీ కాళనమంత్రికిఁ గృతి నొసంగినట్లు

"ఉ. ఇట్టి మహాప్రధానపరమేశ్వరమూర్తివి గాన నీవు చే
     పట్టితి మేలు చుండిపురపాలక, కాళనమంత్రిచంద్ర, మున్
     గట్టిగఁ గృష్ణరాయజనకాంతున కీయక దాఁచినట్టి యా
     రట్టజియైన యెఱ్ఱకవిరాజిత మల్హణకావ్యకన్యకన్."

యని చెప్పికొన్నాఁడు. ప్రబంధరత్నావళిని సంధానించుటకు సాధనములగు రెండుగ్రంథములలో నొకటియగు ప్రబంధరత్నాకరమునఁ బెదపాటి జగన్నాథకవి యీమల్హణచరిత్రమునందలి పద్యముల నుద్ధరించియుండుటచేతను, నం దాతఁడు చేర్చిన కవులలో మాడయగారి మల్లయ, తెనాలి రామలింగయ యర్వాచీను లగుటచేతను, యెఱ్ఱనార్యుఁ డిందుఁ గృష్ణదేవరాయలకుఁ బూర్వులు, సమకాలికులు నగు కవులనే వినుతిచేసియుండుటచేతను నిది శ్రీకృష్ణదేవరాయలకాలమున (క్రీ.శ. 1500 ప్రాంతమున) రచియింపఁబడినదని తేలుచున్నది.