పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

శా. అంభోజాసన! నీకు నీశుఁడు గలం డంటేనిఁ ద త్పక్షమం

దంభోజాతభవాండ మే విభుని లీలాపాంగ సంభ్రాంతిచే

సంభూతంబగు వర్తమానమగు సంఛన్నంబగున్ ద ద్విభున్

సంభావింపఁగ వచ్చునే తలఁప నే చందంబు వాఁ డాకృతిన్. ( 77 )


క. తోయజ సంభవ ! నా కీ, తోయము వివరింపు చాలఁ దోఁచిన నే నా

తోయము వారికి నన్యుల, తోయములం జెందకుండ ధ్రువ మెఱిఁగింతున్. ( 78 )


వ. దేవా! భూత భవిష్య ద్వర్త మానంబులగు వ్యవహారంబులకు నీవ విభుండవు. నీ వెఱుంగని యర్థం బించుకయు లేదు. విశ్వప్రకారంబు వినిపింపు మనిన విని వికసితముఖుండై విరించి యిట్లనియె. ( 79 )

క. రారా? బుధులు విరక్తులు, గారా? యీరీతి నడుగంగా నేరరు వి

స్మేరావహము భవ స్మిత, మౌరా ! నా పైడి! మర్మ మడిగితి వత్సా! ( 80 )


శా. నానా స్థావర జంగమ ప్రకరముల్ నాయంత నిర్మింప వి

న్నాణం బేమియు లేక తొట్రుపడఁగా నాకున్ సమస్తాను సం

ధానారంభ విచక్షణత్వము మహోదారంబుగా నిచ్చె ము

న్నే నా యీశ్వరు నాజ్ఞఁ గాక జగము ల్నిర్మింప శక్తుండనే. ( 81 )


మ. అనఘా! విశ్వమునెల్ల దీప్తముగఁ జేయన్ నే సమర్థుండనే?

యిన చంద్రానల తారకాగ్రహ గణం బే రీతి నా రీతి నె

వ్వని దీప్తిం బ్రతిదీప్త మయ్యె భువనవ్రాతంబు, దద్దీప్తిచే

ననుదీప్తం బగు నట్టి యీశ్వరున కే నశ్రాంతమున్ మ్రొక్కెదన్. (82 )


మ. వినుమా యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి

గ్గున సంకోచము నొంచు మాయవలనం గుంఠీభవ త్ప్రజ్ఞచే

నను లోకేశ్వరుఁ డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే

ననిశంబు న్నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుతా! ( 83 )


వ.మఱియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులను, జన్మనిమిత్తంబు లైన కర్మంబులును, కర్మక్షోభకంభైన కాలంబును, కాల పరిణామ హేతువైన స్వభావంబును, భోక్తయైన జీవుండును, వాసుదేవుండుగా నెఱుంగుము.