పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

58


క. అంతట వారల మరణము, వింతయగుచుఁ జూడఁబడిన విడురుఁడు చింతా

సంతాప మొదవఁ బ్రీత, స్వాంతుడై తీర్థములకుఁ జనియెడు నధిపా ! (1-328)


వ. అని విదురాదుల వృత్తాంతం బంతయు ధర్మనందనున కెఱింగించి తుంబురు సహితుండై నారదుండు స్వర్గంబునకు నిర్గమించిన వెనుక, ధర్మజుండు, భీమునిం జూచి యిట్లనియె. (1-329)

అధ్యాయము - 14

ధర్మరాజు దుర్నిమిత్తంబులం గని చింతించుట

సీ. ఒక కాలమునఁ బండు నోషధీచయము వే ఱొకకాలమునఁ బండకుండ నండ్రు

క్రోధంబు లోబంబుఁ గ్రూరత బొంకును దీపింప నరుల వర్తింతు రండ్రు

వ్యహహారములు మహావ్యాజయుక్తము లండ్రు సఖ్యంబు వంచనా సహితమండ్రు

మగలతో నిల్లాండ్రు మచ్చరించెద రండ్రు సుతులు దండ్రులఁ దెగఁజూతురండ్రు

తే. గురుల శిష్యులు దూషించి కూడ రండ్రు, శాస్త్రమార్గము లెవ్వియు జరుగ వండ్రు

న్యాయపద్ధతి బుధులై వడవ రండ్రు, కాలగతి వింతయై వచ్చెఁ గంటె నేడె. (1-330)


మ. హరిఁ జూడన్ నరుఁ డేఁగినాడు నెల లే డయ్యంగదా ! రారు కా

లరు లెవ్వారును, యాదవుల్ సమద లోలస్వాంతు లేవేళ సు

స్థిరులై యుండుదురా ? మురారి సుఖియై సేమంబుతో నుండునా ?

యెరవై యన్నది చిత్త మీశ్వరకృతం బెట్లోకదే ? మారుతి ! (1-331)


క. మానసము గలఁగుచున్నది మానవు బహు దుర్నిమిత్త మర్యాదలు, స

న్మానవ దేహక్రీడలు, మాన విచారింప నోపు మాధవుఁ డనుజా ! (1-332)


క. మనవులు చెప్పక ముందఱ, మన దార ప్రాణ రాజ్య మాన శ్రీలన్

మనుపుదు నని యాదేవుఁడు, మనమునఁదలపోసి మనిచె మనలం గరుణన్. (1-333)


క. నారదుఁ డాడిన కైవడిఁ, గ్రూరపుఁ గాలంబు వచ్చెఁ గుంభిని మీఁదన్

ఘోరములగు నుత్పాతము, లారభటిం జూడఁబడియె ననిలజ కంటే. (1-334)