పుట:Sri Mahabagavathamu Vol 1.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

వ. ఇట్లు హరిసేవారతిం జేసి ప్రపంచాతీతుండనై బ్రహ్మరూపకుండనైన నా యందు స్థూలసూక్ష్మంబైన యీ శరీరంబు నిజమాయా కల్పితంబని యమ్మహాత్ములగు యోగిజనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణియైన భక్తి సంభవించె. అంతఁ జాతుర్మాస్యంబు నిండిన నయ్యోగిజనులు యాత్ర సేయువారలై యివ్విధంబున. (1-106)


మ. అపచారంబులు లేక నిత్య పరిచర్యా భక్తి యుక్తుండనై

చపలత్వంబును మాని నేఁ గొలువఁగా సంప్రీతులై వారు ని

ష్కపటత్వంబున దీనవత్సలతతోఁ గారుణ్య సంయుక్తులై

యుపదేశించిరి నాకు నీశ్వర రహస్యోదార విజ్ఞానమున్. (1-107)


వ. ఏనును వారి యుపదేశంబున వాసుదేవుని మాయానుభావంబుఁ దెలిసితి. ఈశ్వరునియందు సమర్పితంబైన కర్మంబుఁ దాపత్రయంబు మాన్ప నౌషధంబగు. ఏ ద్రవ్యంబు వలన నే రోగంబు జనియించె నా ద్రవ్య మా రోగంబును మానుప నేఱదు. ద్రవ్యాంతరంబు చేతనైన చికిత్స మానుపనోపు. ఇవ్విధంబునఁ గర్మంబులు సంసార హేతుకంబులయ్యు నీశ్వరార్పితంబులై తాము తమ్ముఁ జెఱుపుకొన నోపియుండు. ఈశ్వరునియందుఁ జేయంబడు కర్మంబు విజ్ఞానహేతుకంబై ఈశ్వర సంతోషణంబును భక్తియోగంబునుం బుట్టించు. ఈశ్వరశిక్షం జేసి కర్మంబులు సేయువారలు కృష్ణగుణనామవర్ణన స్మరణంబులు సేయుదురు. ప్రణవ పూర్వకంబులుగా వాసుదేవ ప్రద్యుమ్న సంకర్షణానిరుద్ధమూర్తి నామంబులు నాలుగు భక్తిం బలికి నమస్కారంబు సేసి మంత్రమూర్తియు శూన్యుండు నైన యజ్ఞపురుషునిం బూజించు పురుషుండు సమ్యగ్దర్శనుండగు. (1-108)


కం. ఏ నివ్విధమునఁ జేయఁగ, దానవ కులవైరి నాకుఁ దనయందలి వి

జ్ఞానము నిచ్చెను మదను,ష్ఠానము నతఁ డెఱుఁగు నీవు సలుపుము దీనిన్. (1-109)


కం. మునికులములోన మిక్కిలి, వినుకులు గలవాఁడ వీవు విభు కీర్తులు నీ

వనుదినముఁ బొగడ వినియెడి, జనములకును దు:ఖమెల్ల శాంతిం బొందున్. (1-110)