Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కొండవీడు

సంగ్రహ ఆంధ్ర

ప్రభుత్వము ఏర్పడిన తరువాత అప్పటి పాలకులు తమ తమ పేర్లతో పేటలను కట్టించిరి. ఉదా : మహమ్మద్ షా పురము (కుతుబ్ షా పేట), నవాబ్ పేట, ముర్తజా నగర్ (గోపీనాథ పురము) మొదలగునవి.

పూర్వము కొండవీటికి కుండిననగరము అని పేరుండె ననియు, అది విదర్భ దేశమునకు ముఖ్యపట్టణముగా నుండె ననియు, ఇచటనే దమయంతి, రుక్మిణి జన్మించిరనియు, ఇప్పటి అమీనాబాదువద్ద గల కొండపై నున్న 'ముల్ల గూరమ్మ' యే రుక్మిణి పూజించిన పార్వతి యనియు, ఇచటివారు చెప్పుదురు. ఇదియే కుండిననగరమని 'దండకవిలె' యందు గూడ వ్రాయబడి యున్నది. దండకవిలె యందలి వ్రాతలను ఈ క్రింది శాసనములు సమర్థించుచున్నవి :

1. మంచాళ్ళ శాసనము : "శా. శ. ౧౨౬౨ (1262) విక్రమ సం. మార్గశిర శు. ౧౫ లు సోమవారమునందు శ్రీ వల్లభశిష్ట నామధేయ ద్విజాయ కుండిన నామ నగర ప్రాద్దిగ్భాగే, భద్రానది పశ్చిమ తీరప్రాంత దేశే శ్రీకృష్ణానదీ పశ్చిమయామ్య దిక్సంధిస్థ జనపదేషు ప్రసిద్ధ మంచాళ్ళగ్రామ మతి ముఖ్యాగ్రహార దానం కర్తుమిచ్ఛన్" అని గలదు.

2. కొండవీటి గోపీనాథుని గుడివెనుక (పడమట) రెండవ ఆలయ స్తంభమున గల శా. శ. 1326 విభవ సంవత్సర మాఘ శుద్ధ ౧౨ శాసనమున ఇట్లున్నది: "శ్రీ రామేశ్వరాయ నమః కుండిననామ ప్రసిద్ధేషుభవతి విభవ వత్సరే మాఘ శుద్ధ ద్వాదశ్యాం, జీవవాసరే సవితరి మకర సాహిని లగ్నే సిద్ధ శ్రీనామ భక్త్యా జగతి రఘునాధ్యా శ్రీమాభ్యా పహ్యకల్పం కొండవీట్యామ దగిరి కృతవా నామ లింగ ప్రతిష్ఠా."

3. దండెకవిలెలోని రెడ్డిదత్త అగ్రహారములను గుఱించిన శోకములలో :


తస్యపాద భవేద్రస్య కుండినక్షోణి శాసితః
వేమాఖ్యశ్చతురః పుత్రాః నిత్యధర్మ పరాయణాః:

కొండవీటి దండెకవిలెను బట్టి, కొండవీడు అనాదిగ భీమరాజు, భీష్మకుడు మొదలగువారి కాలములనుండి రాచనివాసమై యుండెననియు, గజపతివంశ క్షత్రియుడగు 'విశ్వంభర దేవుడు' అచట కోటలు కట్టించెననియు తెలియుచున్నది. ఏదిఎటులున్నను, కొండవీడు రెడ్డిరాజుల నాటినుండియు రాజధానిగా నుండెననుటకు సందియము లేదు.

ప్రోలయవేముని రాజధాని అద్దంకి యని బహు శాసనములు వాకొనుచున్నవి. ప్రోలయవేముని తరువాత అతని కుమారుడగు అనపోతారెడ్డి తన రాజధానిని అద్దంకినుండి కొండవీటికి మార్పించినటులు శాసనములవలన తెలియుచున్నది. కొండవీటి రాష్ట్రము కృష్ణా, గోదావరి, గుంటూరు, నెల్లూరు, కర్నూలు మండలములకు వ్యాప్తమై యున్నట్లు రెడ్డిరాజులనాటి శాసనములవలన, బిరుదములవలన తెలియుచున్నది.

ఈ కొండవీడు రాజ్యము క్రింద వివరించిన పెక్కు మంది రాజుల పరిపాలనము క్రిందకు మారుచు వచ్చినది :


ప్రోలయవేమా రెడ్డి 1326 - 1350
అనపోతా రెడ్డి 1350 - 1370
అనవేమా రెడ్డి 1370 - 1385
కొమరగిరిరెడ్డి 1385 - 1407
పెదకోమటి వేమారెడ్డి 1407 - 1420
రాచ వేమా రెడ్డి 1420 - 1423
కటకపురాధీశ్వరుల పాలన 1423 - 1431
కర్ణాటక సామ్రాజ్యాధిపతులు 1431 - 1454
కటకపురాధీశ్వరుల కాలము 1455 - 1496
కర్ణాటక సామ్రాజ్యకాలము 1515 - 1530

గోల్కొండవారు కొండవీటిని 1530 లో జయించిరి. మరల కర్ణాట సామ్రాజ్యాధిపతులు 1530 లో దీనిని జయించి 1579 వరకు తమ ఏలుబడిలో నుంచుకొనిరి. తిరిగి ఈ కొండవీటి రాజ్యము 1579 లో గోల్కొండ రాజుల ఆక్రమణము క్రిందకు వచ్చెను. అనంతరము ఈ సామ్రాజ్యము ఈ క్రింది విధముగా మరల చేతులు మారెను :


చారాముత్సబీల ఏలుబడి 1582 - 1590
గోల్కొండ నవాబు పరిపాలన 1599 - 1749
ఫ్రెంచి పరిపాలన కాలము 1750 - 1757
గోల్కొండ నవాబుల కాలము 1758 - 1786
ఇంగ్లీషువారి పరిపాలన కాలము 1788 - 1947
స్వతంత్ర భారత పరిపాలనము 1947

54