Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/810

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనాదేశము (చ)

సంగ్రహ ఆంధ్ర

క్రూరముగ శిక్షించెను. మానసిక స్వాతంత్ర్యమే నిరంకుశత్వమునకు విరోధి అని వీరి యభిప్రాయము. కాని చైనా సారస్వతము పూర్తిగా నశింపలేదు, నిరంకుశత్వము శాశ్వతము కాలేదు. ఇట్టి చిన్ వంశము 'చైనా' పేరట చిరస్థాయి యైనది.

క్రీ. పూ. 202 లో 'లియూచి' అను నాతడు చిన్ వంశమును నిర్మూలించి, హాన్ వంశమును స్థాపించెను. వీరి రాజధాని సియాన్ అనునది. హాన్ వంశస్థుడైన వూటి అను నాతడు రోమను సామ్రాజ్యముతో తులతూగగల మహా సామ్రాజ్యమును స్థాపించెను. క్రీ. శ. 220 నాటికి హాన్ సామ్రాజ్యము వై, వు, షు అను రాజ్యములుగా విచ్ఛిన్నమైనది. చైనాచరిత్రలో ఇది మూడు రాజ్యముల యుగము . క్రీ. శ. 590 ప్రాంతమున సుయి వంశస్థులు చైనాను సమైక్యమొనర్చి, క్రీ. శ. 618 వరకును పరిపాలించిరి.

ప్రాచీన నాగరికతా సంస్కృతులు : ప్రాచీన కాలమునుండియు చైనా ఆర్థిక సౌష్ఠవము కలదై యున్నది. అనాది పరిశ్రమ యగుటచే రైతులు వ్యవసాయములో ఆరితేరిరి. వరిధాన్యముతోబాటు తేయాకు పంటకు చైనా ప్రసిద్ధి చెందినది. చౌ వంశస్థులు పంటకాలువలు త్రవ్వించి నీటిపారుదల సౌకర్యములను కలిగింపగా. షీహుయాంగ్‌టి భూస్వాముల నణచి రైతులకు మేలు చేకూర్చెను. ఇండియానుండి ముతక పంచదారను చేయుట నేర్చుకొని, చైనావారు చక్కెరను తయారు చేసిరి. పట్టు, పింగాణీ పరిశ్రమలకు చైనా పెట్టినది పేరు. పట్టు వస్త్రములు ఇండియాలో చీనాంబరములని ప్రసిద్ధి చెందినవి. ఈ పరిశ్రమకు టింగ్‌చౌ నగరము కేంద్రము. ఈ యుగముననే, కాగితమును గూడ చైనా తయారు చేసెను. జపాను మొదలు రోము వరకును చైనా పట్టు బట్టలు ఎగుమతి యగుచుండెను. ఒక 'లోయాంగ్ 'లోనే 120 వర్తకశ్రేణు లుండెడివి.

మతప్రవక్తలు : గ్రీసు, పర్షియా, ఇండియా దేశములలో వలెనే, చైనాలో కూడ క్రీ. పూ. 6 వ శతాబ్దమున గొప్ప సాంస్కృతికోద్యమము ప్రారంభమైనది. సుప్రసిద్ధ మతప్రవక్తలు బయలుదేరి, శుష్కకర్మకాండ, మూఢవిశ్వాసముల నుండి ప్రజల దృష్టిని ఆత్మ పరిశీలన, నైతిక ప్రవర్తనల వైపు మరలింప యత్నించిరి. చైనాలో ఈ ఉద్యమమునకు కన్‌ఫ్ఫ్యూషియస్ (క్రీ. పూ. 551-478) నాయకుడు. ఈతడు చైనాకు వేదవ్యాసునివంటి వాడు. 'లు' రాష్ట్రమున, చౌ పట్టణవాసియైన షులియాంగ్‌హో అను నిరుపేదకు, కన్ఫ్యూషియస్ జన్మించెను. బాల్యమునందే, ప్రాచీన సారస్వతము నంతటిని పుక్కిటబట్టి మహావిద్వాంసుడని పేరు ప్రతిష్ఠలు సంపాదించెను. క్రమముగా కన్‌ఫ్యూషియస్‌కు పెక్కు మంది శిష్యులు ఏర్పడిరి. కొంతకాలము చుంగ్‌ టు మండలాధ్యక్షుడుగాను, 'లు' రాష్ట్ర ప్రధానిగాను వ్యవహరించి, శేషించిన జీవితము పదునాలుగు సంవత్సరములు, దేశాటనమొనర్చుచు ధర్మబోధలో గడపెను.

చిత్రము - 217

పటము - 2

చైనా ప్రాచీనశిల్పము, దేవతామూర్తులు

746