Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/791

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చెన్నపట్టణము

ఉండియుండును. ఈ యూరు ఒకప్పుడు పట్టణముగానుండి క్షీణదశకు వచ్చినదై యుండును. ఈ పట్టణము పేరు మాదిరాజు లేక మాదరాజు లేక ముదిరాజు అను పేర్లను కలిగియుండును. ఈ నామములను బట్టియే పాశ్చాత్యులు దానిని మాదిరాస్స, మద్దరాస అను అపభ్రంశ రూపములతో తమ రికార్డులలో వ్రాసి యున్నారు. అదియే తుదకు మద్రాసుగా రాజకీయ చరిత్రలో స్థిరపడిపోయినది. ఏమైనను అది ఆంధ్రరాజుల పరిపాలన లోని దేశమనుట నిక్కము. ఆ ప్రాంతము దామెర్ల వెంకటప్ప పరిపాలనమున అయ్యనృపతి యేలుబడిలో నున్నదనుట నిస్సందేహము దామెర్ల వంశీయులు వెలమదొరలు.

పాశ్చాత్యులు ఆ పట్టణమును మద్రాసు అని పేర్కొన్నను, ఆంధ్రులు నాటినుండి నేటివరకును దానిని చెన్నపట్టణముగానే వ్యవహరించుచున్నారు.

ఆంధ్రకౌముది క్రీ. శ. 1600 లకుముందు రచితమైనది. అందు 'శ్రీలచే మించి చెన్నపురి విలసిల్లు' అని కలదు. ఆలూరి కుప్పనకవి రచించిన (1740 ప్రాంతము) శంకర విజయమునందు “చెన్నపురి చిరత్సచివవరులు" అని కలదు. క్రీ. శ. 1819 చెన్నపురిలో అచ్చుపడిన పుస్తకము లన్నింటను 'చెన్నపట్టణ' మనియే యున్నది 1828 లో ఏనుగుల వీరాస్వామయ్యగారు తమ కాశీయాత్రా చరిత్రలో 'చెన్నపురి' అనియే పేర్కొని యున్నారు. క్రీ. శ. 1846 లో కోలాశేషాచల కవి తన 'నీలగిరి యాత్ర' యను వచన కావ్యమునందు చెన్నపురిని ఒక సీసమాలికలో వర్ణించి యున్నాడు. క్రీ. శ. 1850 ప్రాంతమున మహోద్దండకవి శిష్టుకృష్ణమూర్తిశాస్త్రి తన 'వీక్షారణ్య మహాత్మ్యము'న చెన్నపురిని పేర్కొనినాడు. 1855 ప్రాంతమున తడకమళ్ళ వేంకట కృష్ణారావు తన లీలావతి గణితమున చెన్నపురిని పేర్కొనియున్నాడు. 1861 లో మతుకుమల్లి నృసింహకవి "చెన్నపురీ విలాస"మను పేరుతో ఒక పద్య కృతినే రచించియున్నాడు. ఈ చెన్నపురీ విలాసకావ్యము 1862 లో "శ్రీ చెన్ననగరాభరణాయమాన తండియార్పేట శాఖానగర విహి తాదిసరస్వతీనిలయ వివేక రత్నాకర ముద్రాక్షరశాల" యందు ముద్రితమైనది. ఇంతయేల అరవవారుకూడ చెన్నై అనియు, చెన్ననగర మనియు పిలుచుచున్నారు.

చెన్నపట్టణ మప్పుడు రెండు సీమలుగా విభజింపబడి నట్టులుగా కనబడుచున్నది. ఒకటి ముత్యాలపేట. రెండవది పెద్దినాయనిపేట. ఈ రెండు నామములు తెనుగు తనమునే సూచించుచున్నవి. "చెన్నపురి విలాసము" అను కావ్యములోని వర్ణనలనుబట్టి పటము వ్రాయించినచో నేడు క్రొత్తగా బయలుదేరినవి గాక మిగిలిన వీధులు, కట్టడములు, కార్యస్థానములు, వాని పేళ్లలో మార్పులు, మార్పులకు కారణములు చెన్నపట్టణ ప్రాచీన స్వరూపము యొక్క యధార్థ స్థితులు మనకు తెలియగలవు.

క్రీ. శ. 1645 నాటికే చెన్నపట్టణములో తెలుగువా రుండి రనుట చారిత్రక సత్యము. ఇంగ్లీషువారికి బందరులో వర్తకశాల లున్నందువలన వారివద్ద తెలుగువారే ఉండియుండిరి. అంతేగాక ఇంగ్లీషు వారితో వచ్చినట్లు చెప్పబడిన బేరి తిమ్మన్న, కాశి వీరన్న, ముత్తు వీరన్న, సూరె వెంకన్న, ముత్తుశెట్టి, కాశి వీరయ్య, పసుమర్తి కాశయ్య, పట్టకాల బాలశెట్టి, రంగాశెట్టి, నారాయణప్ప, వెంకటాద్రి, శేషాద్రి మున్నగువారందరు తెలుగువారే. నాగాబత్తుడు (రాఘవబత్తుడు) చెన్నపట్టణమునకు కరణము. ఇతడు కంసాలి. ఈతడు ధర్మము లాచరించి దేవాలయములు కట్టించెను.

వెంకటపతి రాయల మునిమనుమరాలు పాపమ్మ. ఆమె భ ర్త సుబ్రాయుడు. వీరిరువురి పేర్లమీదుగా 'పాపమ్మ - సుబ్రాయుడు వీధి' యని ప్రారంభమున నామము ధరించి, క్రమముగా 'పావ్ హామ్' అను ఇంగ్లీషు ధనికుని పేరుమీదుగా పావ్ హామ్స్ బ్రాడ్వే అను పేరు వాడుకలోకి వచ్చెను.

చింతాద్రిపేట : ఇది తెలుగు పేరు. చింత - అద్రి అనగా చింతచెట్లుండే ప్రదేశమని అర్థము. శ్రోత్రియందారైన జి. ఆర్. ఆదికేశవులు నాయుడుగారి కుటుంబము ఇచ్చటనే ఉండుచుండెను. సుప్రసిద్ధులైన బండ్లపేరిటి కుటుంబాలవారు కూడా ఇక్కడనే యుండెడువారు. బండ్ల వేణుగోపాలనాయుడు, వెంకటరామానుజులు నాయుడు, ఆ కుటుంబములోని వారే. ఈ ప్రాంతములోనే సుంకువారి అగ్రహారమను పేట గలదు. సుంకువారు తెలుగువారే.

చెట్ పట్ : ఇది 'చేతిపట్టు' అను శబ్దము యొక్క భ్రష్టరూపము ఇది తెలుగు పేరు.

729