విజ్ఞానకోశము - 3
చెకోస్లావేకియాదేశము (చ)
స్వరూపముకూడ ఈ సమస్యను మరింత చీకాకు పెట్టినది. ఇట్టి విషమ సమస్య లెన్నో బయలుదేరినను, ఈ ప్రభుత్వము వాటి నెదుర్కొని, విజయవంతముగ పురోగమించుచున్నది.
క్రీ. శ. ఆరవ శతాబ్దమున 'స్లావ్ ' జాతివారు తూర్పు తీరమునుండి బొహీమియా రాజ్యమునకు వలస వచ్చిరి. పిమ్మట సుమారు మూడు వందల సంవత్సరములకు సెయింట్ సిరిల్ మున్నగు మతప్రచారకులు ఈ ప్రాంతమున క్రైస్తవ మత ప్రచారము చేయదొడగిరి. పదునొకండవ శతాబ్దమున స్లావెక్కులు హంగేరిదేశ మాగ్యర్ వంశస్థుల అధీనములోనికి రాగా, చెక్కులు నాల్గవ చార్లెస్ (1346-78) యొక్క పాలనమున, 'హోలీ రోమన్’ (పవిత్ర రోమక) సామ్రాజ్యమునందు ప్రముఖ పాత్రను వహించిరి. బొహీమియాలోని 'హస్సైట్' సంచలనమును యూరప్లోని ప్రాటెస్టెంట్ తిరుగుబాటులోని నాందీ ప్రస్తావనలతో సమన్వయింప వచ్చును. జాన్ వైక్లిఫ్ అనుయాయుడును గొప్ప చెక్ పండితుడు నగు జాన్హస్యొక్క శిష్యసంతతి ప్రారంభించిన 'హస్సైట్ ' ప్రచారమును రోమన్ కాథలిక్కులు నిరసించిరి.
1526 న 'హావ్స్బర్గ్ ' (ఆస్ట్రియా) వంశమునకు చెందిన మొదటి ఫర్డినెండ్ బొహీమియా రాజ్యమునకు రాజయ్యెను. 1602 న చెక్కులు స్వాతంత్ర్య పోరాటమును జరిపి, నవంబర్ 8 వ నాడు, హావ్స్బర్గులచేత ఓడింప బడిరి. దీని ఫలితముగా ఈ తిరుగుబాటును లేవదీసిన ప్రముఖు లందరును హత్య గావింపబడిరి. నాటినుండి సుమారు మూడు శతాబ్దములవరకు, చెక్కులు స్వాతంత్య్ర జీవితమును కోల్పోవుటయే కాక, బొహీమియన్ ప్రాటెస్టెంట్ మతము సమూలముగ తుడిచి వేయ బడినది.
ప్రథమ ప్రపంచ సంగ్రామము నాటికి, అంతవరకు అసంతృప్తితో అలజడి చేయుచుండిన చెక్కులును, స్లావెక్కులును స్వాతంత్ర్య జీవనోద్దేశమున ఏకమై, దూరదృష్టి గలవాడును కార్యనిర్వహణ ధురీణుడును అయిన మాసరిక్ (Tomas Garrigue Masaryk) అనునతనిని నాయకునిగా గ్రహించిరి. ఆస్ట్రియన్ పోలీసు దళములు తన్ను బంధింప నున్నవని గ్రహించి 1914 లో మాసరిక్, విదేశముల నుండియే చెకోస్లావేకియన్ బలములను కూడబరచుకొనుచు, తన మిత్రుల మూలమున స్వదేశమున జరుగు మార్పుల నరయుచు, స్వాతంత్ర్య సన్నాహములను చేయుచుండెను. అమెరికాలో నున్న చెకోస్లావేకియన్ పౌరులు ఈ స్వాతంత్య్ర పోరాటమునకు వలయు ఆర్థిక సహాయము చేయ సిద్ధపడిరి. నాటి మాసరిక్ ప్రయత్నములకు లండన్ నగరము కేంద్రముగ నుండెను. 1915 లోనే మాసరిక్ ఆస్ట్రియాకు చెకోస్లావేకియా స్వాతంత్ర్యము విషయమై ఒక ప్రకటన గావించెను. 1918 జూన్ 30 వ తేదీ చెకోస్లావేకియన్ నేషనల్ కౌన్సిల్ అధ్యక్షుడైన మాసరిక్, తాను అమెరికాలో నున్నప్పుడు నూతన ప్రజాప్రభుత్వ నిర్మాణమునకు గాను, చెక్కులు స్లావెక్కుల మధ్య నొక యొడంబడికను చేయించెను. అమెరికా సంయుక్త రాష్ట్రములు, గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్సు, ఇటలీ దేశము లీ నూతన ప్రభుత్వ నిర్మాణము నామోదించినవి. 1918 అక్టోబర్ 14 వ తేదీ పారిస్ నగరమున డా॥ బినెస్ చెకోస్లావేకియన్ తాత్కాలిక ప్రభుత్వము నేర్పరచెను. అక్టోబరు 18న వాషింగ్టన్ నగరము నుండియు, 28 తేదీన ప్రేగ్ నగరములోను మాసరిక్ చెకోస్లావేకియా స్వాతంత్ర్యమును ప్రకటించెను. 1920 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగినవి. ఫిబ్రవరి 19 తేదీన తొలిసారిగా పౌరులచే ఎన్నుకొనబడిన ప్రతినిధుల 'నేషనల్ అసెంబ్లీ ' సమావేశమయినది.
నేషనల్ అసెంబ్లీ మాసరిక్ ను దేశాధ్యక్షునిగాను, క్రామర్ ను ప్రధానమంత్రిని గాను, డా॥ బినెస్ ను విదేశాంగ మంత్రినిగాను ఎన్నుకొనినది. నానాజాతి సమితి (League of Nations) తోను, ఫ్రాన్సు, రష్యా దేశములతోను ఈ ప్రభుత్వము సన్నిహిత సంబంధములను నిలుపుకొన్నది. అందుకుతోడు ఇరుగు పొరుగు దేశములతోను శాంతియుతమును, నిర్మాణాత్మకమును అయిన స్నేహమును పెంపొందించుకొన్నది. 'లోకార్నో' ఒడంబడిక అనంతరము (1925 - 1926) జర్మనీ దేశముతో గూడ సన్నిహిత సంబంధ మేర్పడినది. 1929 లో మాగ్యర్ల కలహముల నణచుటకును, డాన్యూబ్ నదిమీద వర్తకము నభివృద్ధి గావించుటకును 'లిటిల్ ఎన్టెన్ట్' ఒడంబడికను ఈ ప్రభుత్వము యుగోస్లావియా, రుమేనియా దేశములతో చేసికొన్నది.
717