Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/773

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చిలీదేశము

కాలమున రాజకీయ కలహములు, కార్మిక సంఘర్షణములు చెలరేగెను. వెలుపలినుండియు, లోపలినుండియు (విశేషముగా శక్తిమంతమైన కమ్యూనిస్టుపార్టీ నుండి) కలిగిన బలమైన ఒత్తిడికారణముగా తుదకు చిలీ అక్ష రాజ్యములతో (జర్మనీ, జపాను) తనకుగల సంబంధమును 1943 సంవత్సరము జనవరి 20 వ తేదీన విచ్ఛేదమొనర్చుకొనెను. కాని ఆ దేశము 1945 సంవత్సరము ఫిబ్రవరి 14 వ తేదీవరకు జపానుపై యుద్ధము ప్రకటింపలేదు.

రియోస్ అనునతడు 1946 సంవత్సరము జూన్ 27 వ తేదీన మరణించెను. వెంటనే ఒక అసాధారణమైన ఎన్నిక జరిగెను. అందులో 1946 సం. నవంబరు 3 వ తేదీన 'వామ - సెంటర్ మిశ్రమపక్షముల' (Leftist-center Coalition) అభ్యర్థియగు గేబ్రియల్ గంజాలెజ్ విడెలా (Gabriel Gonzalez Videla) అనునతడు అధ్యక్షుడయ్యెను. అతని పరిపాలనమునకూడ తరచుగ సంభవించిన కార్మిక కల్లోలముల మూలమున దేశమునకు తీవ్రముగ నష్టము కలిగెను. ఈ కల్లోలములో కొంతవరకు కమ్యూనిస్టు ప్రభావమున్నట్లు తెలియుచున్నది. గేబ్రియల్ కమ్యూనిస్టు ప్రతికూలవిధానము ననుసరించెను. అతనిపిమ్మట కార్లస్ ఇబాఫియెజ్ (Carlos Ibafez) అను నతడు 1952 సంవత్సరము సెప్టెంబరు 4 వ తేదీన అధ్యక్షుడుగా ఎన్నుకొనబడెను.

ప్రభుత్వము - రక్షణ : చిలీ ప్రజలు ఆరు సంవత్సరముల కొకసారి అధ్యక్షుని, ఎనిమిది సంవత్సరముల కొకసారి 45 మంది సభ్యులు గల సెనటును (వీరిలో సగము మంది నాలుగు సంవత్సరముల కొకసారి మారు చుందురు.), నాలుగు సంవత్సరములకొకసారి 147 మంది సభ్యులుగల 'ఛేంబర్ ఆఫ్ డెప్యూటీస్' అను మరియొక ప్రజాప్రతినిధి సభను ఎన్నుకొందురు. అధ్యక్షుడు తనకు తోడ్పడుటకై తనకు బాధ్యత వహించు ఒక మంత్రివర్గమును నియమించును. కాని ఈ మంత్రివర్గము కాంగ్రెసు చేయు దేశద్రోహనే విచారణకు (impeachment) లో బడియుండును. అధ్యక్షుడు చెలాయించు 'వీటో' (Veto) అను ప్రతికూలాభిప్రాయమును సహితము 2/3 వంతులు ఓటుచే రద్దుచేయు అదికారమును కాంగ్రెసు కలిగియుండును. ఎన్నికలలో 2 సంవత్సరముల వయస్సు పై బడిన అక్షరాస్యులగు పౌరులందరకు వోటుచేయు అధికారము కలదు.

చిలీదేశములో సైనికశిక్షణ నిర్బంధము చేయబడెను. ఈ శిక్షణ ఇరువది సంవత్సరముల వయఃకాలమున ఆరంభ మగును. మొదటి 9 నెలల పర్యంతము ప్రారంభ శిక్షణ ఒసగబడును. ఈ శిక్షణ అయిన పిదప 45 వ సంవత్సరపు వయస్సు వరకును ప్రతి పౌరుడును మూలబలము (Reserve) లో చేరి యున్నట్లు భావింపబడును. 1948 వ సంవత్సరమున జరిగిన అనధికార అంచనానుబట్టి, చిలీలో 25,000 సైనికబల మున్నట్లు తెలియుచున్నది. నౌకాదళమునందు మామూలుగా 12,000 మంది యోధు లుందురు. ఈ దళములో 1953 వ సం. న 28,000 టన్నుల పాత యుద్ధనౌక యొకటియు, 1951 వ సంవత్సరమున అమెరికానుండి సంపాదించుకున్న రెండు తేలికపాటి క్రూయిజర్లును, ఆరు డిస్ట్రాయర్లును, ఆరు ఫ్రైగేట్లును, ఏడు జలాంతర్గాములును, రెండు సముద్రతీర రక్షక నౌకలును, ఇతరములైన చిన్న ఓడలును కలవు. ద్వితీయ మహాసంగ్రామ సందర్భమున చిలీలో విమానబలము అభివృద్దికి తేబడెను.

సాంఘిక, ఆర్థిక పరిస్థితులు : 7-15 సంవత్సరముల వయస్సు గల బిడ్డలకు చిలీ కేంద్రప్రభుత్వము నిర్బంధోచిత విద్యావిధానమును అమలునం దుంచెను. 1948 వ సం. న చేయబడిన అంచనా ప్రకారము చిలీదేశమున నిరక్షరాస్యత 24 శాత మున్నదని తెలియుచున్నది. దక్షిణ అమెరికా యందలి దేశములలో ఈ విషయమున చిలీ మూడవస్థాన మాక్రమించును. 1948 సం. లో పాఠశాలలకు పోవు బాలబాలికల సంఖ్య దాదాపు 7,39,000. చిలీదేశములో ప్రభుత్వ విశ్వవిద్యాలయముతో కలుపుకొని 5 విశ్వవిద్యాలయము లున్నవి. విద్యనిమిత్తమై బడ్జెటులో 20 శాతము వినియోగింప బడుచున్నది.

చిలీదేశములో కొందరు జర్మనులు, ఆంగ్లేయులు, పోలండుదేశీయులు, స్కాటులు ఉండియున్నను తెల్లవారిలో అధికసంఖ్యాకులు స్పెయిన్ దేశీయులే. రోమన్ కాథొలిక్ మతమే అచటి ప్రధాన మతము. కాని 1925 వ సం.లో రాజ్యాంగము నుండి మతము వేరుచేయబడెను.

చిలీ యందు వ్యవసాయము కాలిఫోర్నియాలో వలె,

711