Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కేరళదేశము - (చరిత్ర)

సంగ్రహ ఆంధ్ర

బాకీపడిపోయినందున, అది చెల్లించుటకై దళవాయి వేలుతంపి సేనను తీసివేసెను. నిరుద్యోగులైన సైనికులు తిరుగుబాటు చేయగా బ్రిటీషు రెసిడెంటు సహాయమతో, వారి నణచవలసివచ్చెను. తత్కారణముగా వారికి మరికొన్ని హక్కులను, ఎక్కువ కప్పమును ఇయ్యవలసి వచ్చినది. తిరిగి కప్పము బాకీపడుటతో దళవాయికిని రెసిడెంటుకును గల స్నేహమంతమొంది, కర్నల్‌ మెకాలే యొక్క పొగరుబోతుతనమునకు సహించని దళవాయి బ్రిటీషువారికి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసెను. కొచ్చిన్‌ సంస్థాన మంత్రియగు పలియన్‌ అచ్చన్‌ కూడ ఏకీభవించెను. కాని బ్రిటీషు సైన్యము తిరుగుబాటును సంపూర్ణముగా అణచివేసెను. వేలుతంపి దళవాయి మాత్రము బ్రిటీషుసైనికులకుచిక్కక, ఆత్మహత్యగావించు కొనెను. ఇతడు బ్రిటీషువారికి విరుద్దముగా మొట్టమొదట కత్తినెత్తిన వీరుడు. బ్రిటీషువారితో తిరిగి మైత్రికలిగినది. అసమర్థుడగు బాలరామవర్మ మరణానంతరము రాణి గౌరీలక్షీబాయి, రాణి గారీపార్వతీబాయి, మహారాణితై, కర్నల్‌ మన్రోయను రెసిడెంటు సలహాల ప్రకారము బ్రిటీషువారి ప్రభుత్వ విధానము ననుసరించి అనేకమైన మార్చులను గావించి చక్కగా పరిపాలించిరి.

వీరి పిదప రాజ్యూభిషిక్తుడయిన స్వాతితిరునాళ్‌ మహారాజు సుప్రసిద్దుడగు వాగ్గేయ కారకుడు. గొప్ప పండితుడు. కవి. భక్తాగ్రేసరుడు. సమయజ్ఞు డగు ఈ మహరాజు మున్‌సిపు కోర్టులను, జిల్లాకోర్టులను ఏర్పరచి, ఇంజనీయరింగు శాఖను స్థాపించి, చట్టములను శాసించి, వైద్యశాలలను జ్యోతిషాలయములను నెలకొల్పి ప్రగతి మార్గమున పరిపాలించెను. 34 సంవత్సరములు మాత్రమే జీవించిన మహామహుడు తుదకు రెసిడెంటుతో అభిప్రాయ భేదము కలిగి దైవభక్త్యతిశయముచే పూజాధ్యాన పరాయణుడై వైరాగ్యముతో జీవితము ఏకాంతముగా గడుపుచు వచ్చెను. పరిపాలన యందు శ్రద్ధ కలిగి యుండలేదు. బహుభాషాభిజ్ఞుడయిన ఈ పండిత మహారాజకవి సంగీత సాహిత్యములం దెనలేని ప్రతిభాశాలియై పెక్కు కావ్యములను, స్తోత్రములను ఏడుభాషలందు అఖిల భారతమున గాయకులకు ఉపాధేయములగు కీర్తనలను రచించెను.

ఇతని తమ్ముడగు ఉత్తరం తిరునాళ్‌ కాలములో (1855) బానిసలకు విముక్తి లభించినది. రెసిడెంటుతో అతనికి మైత్రి గలిగియున్నను, ఐరోపీయ క్రైస్తవ మిషనరీలు అతని పరిపాలనా పద్ధతులను విమర్శించుచు పలువిధములయిన ఆరోపణలను గావించి, మద్రాసు గవర్నరువద్ద చాడీలు చెప్పిరి. కాని సర్దుబాటు జరిగి అలజడి శాంతించినది. ఆతని తరువాత రాజగు అల్యం తిరునాళ్‌ రామవర్మ కాలములో తిరువాన్కూరు సంస్థానము ఉన్నతదశ నొందెను. ఈ స్టేటుకు 'ఆదర్శరాష్ట్ర' (Model State) మను గౌరవముకూడ కలిగినది. అనేకములయిన అక్రమములైన పన్నులు రద్దుచేయబడెను. సంస్థానము బ్రిటిషు జిల్లాలమధ్య వ్యాపారమునకు సంబంధించిన ఆటంకములు తొలగి వాణిజ్య మభివృద్ధి నొందినది. “అంచల్‌ " అను పోస్టు వ్యవస్థయొక్క సౌకర్యము ప్రభుత్వమునకే కాక ప్రజలకుకూడ కలిగించ బడినది. సర్కారు భూముల పట్టాహక్కులు భూస్వాముల కీయబడినవి. పాఠశాలలు, కళాశాలలు, పబ్లికువర్క్సు వైద్యశాఖలు మిగుల అభివృద్దిగాంచినవి. 'మహారాజా' అను బిరుదము అతనికి బ్రిటిషు చక్రవర్తిచే ప్రసాదింప బడెను.

అతని తరువాత శ్రీ విశాఖ తిరునాళ్‌ పదవీధరుడయ్యెను. గొప్ప పథకములు వేసెను. ఆ మహారాజు లంచగొండితన మును, పరిపాలన యందలి అవినీతిని రూపు మాపుటకు ప్రయత్నించెను. అయిదు సంవత్పరములు మాత్రము పరిపాలించి గతించెను. ఆ మహారాజు పిదప, శ్రీ మూలం తిరునాళ్‌ 39 సంవత్సరములు చక్కగా పరిపాలించి తిరువాన్కూరు సంస్థానమును సర్వతోముఖాభివృద్ధికి తీసికొనివచ్చి ఆధునిక రాజ్యాంగ సంస్కరణల నొనరించి శ్రీ మూలంసభ యను శాసనసభను నెలకొల్పి, దేశీయ సంస్థాన పరిపాలకులలో అగ్రగణ్యుడని ఖ్యాతి వహించెను.

శ్రీ మూలం తిరునాళ్‌ 7 వ ఆగస్టు 1924 సంవత్సరమున దివంగతు డయినందున శ్రీ బాలరామవర్మ చిత్రా తిరునాళ్‌ మహారాజు సింహాసనాసీను డయ్యెను. 1949 వరకు తిరువాన్కూరు మహారాజుగ ఇతడు ఏలుబడి సాగించెను. పిదప తిరువాన్కూరు-కొచ్చిన్‌ సంయుక్త రాష్ట్రమునకు

30