విజ్ఞానకోశము - 3
కేరళదేశము (చరిత్ర)
ఇట్టి పురములే. తిరునల్వేలి ప్రాంతమునుండి పలుమారు లాక్రమణ జరుగుచుండుటచేత కల్కులమ్ అనుచోట సేనలను స్థాపించి రక్షణమున కేర్పాట్లు చేయవలసివచ్చినది. అందుచేత అదే రాజధానిగా మారిపోయినది. ప్రాచీన రాజధాని కొల్లమ్ (Quilon) యొక్క ప్రాముఖ్యము తగ్గిపోయినది. ఈకాలపు విదేశీయులగు యాత్రికుల వ్రాతలవలన, సంఘటితమైన వ్యవస్థ కలిగి అభ్యుదయ పథములో నడచుచున్నట్లు తెలియుచున్నది.
క్రీ. శ. 15 - 16 శతాబ్దముల కాలము విజయనగర సామ్రాజ్య విస్తరణమునకు చెందినది. విజృంభమాణమగు మహమ్మదీయుల శక్తి నెదుర్కొని వారి నరికట్టు బాధ్యతను వహించి విజయనగర రాజులు ఇతర హిందూరాజులకు సాహాయ్యమొసగి వారిని సామంతులనుగా నొనర్చుకొనిరి. తిరువాన్కూరునకు అట్టి సాహాయ్య మనవసరమై నందున విజయనగరమునకు అది తలయొగ్గలేదు. తత్కారణముగా స్పర్ధ ఏర్పడి క్రీ. శ. 1503 ప్రాంతములో యుద్ధముజరిగి, తిరువాన్కూరు గెలిచినదని బుడతకీచు వైస్రాయి వ్రాసియున్నాడు. ఒక శతాబ్దము వరకు అనేక సారులు విజయనగర తిరువాన్కూర్ల మధ్య యుద్ధములు జరిగినవి. అట్లే మధురనాయకులతోను పోరాటములు జరిగినవి. ఈ కాలములోనే బుడతకీచులు ఉత్తర మలబారుతీరమున వ్యాపారమునకై వచ్చి స్థానముల నాక్రమించుకొనిరి. కొల్లం (Quilon) మున్నగు ప్రదేశములందు ఫ్యాక్టరీలను పెట్టిరి. సెంటుఫ్రాన్సిస్స్ ఝెవియర్ (St. Francis Xavier) దక్షిణ తిరువాన్కూరులో నివసించి క్రైస్తవమత ప్రచారము సాగించెను. ఈ కాలపు రాజులలో ఉదయమార్తాండవర్మ కీర్తిమంతుడయ్యెను. క్రీ. శ. 17వ శతాబ్ది అత్యంతమగు అశాంతికాల మని చారిత్రకు లొప్పుకొనెదరు. ఈ కాలముననే రవివర్మ యను మైనరు రాజునకు రీజెంటుగా రాణి ఉమాయమ్మ పరిపాలించినది. ఆమె, క్రీ. శ. 1684 వ సంవత్సరములో బ్రిటిషువారికి ఒక ఫ్యాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞనొసగి, బ్రిటిషువారి స్నేహాదరములకు పాత్రురాలైనది. అంతకు మున్నే ఉన్ని కేరళవర్మ క్రీ. శ. 1644 లో ఒక ఫాక్టరీని నిర్మించుటకు అనుజ్ఞ నొసగియుండెను. ఈ సంబంధమే బలవడి తిరువాన్కూరు కూడ, ఈస్టు ఇండియా కంపెనీ యొక్క అధికార ప్రాబల్యమునకు ఇతర దేశీయరాజ్యములవలె లొంగిపోయినది.
క్రీ. శ. 18వ శతాబ్దమున సుప్రసిద్ధు డగు మార్తాండవర్మ పరిపాలనలో తిరువాన్కూరు రాజ్యమునకు గొప్పస్థాయి లభించినది. ఈ మహారాజు చిన్ని చిన్ని సంస్థానముల నేలుచు, పరస్పర కలహము లొనర్చుచు, ప్రజలపై దౌర్జన్యములను గావించుచు రాష్ట్రమునందు అశాంతికి సామంతుల నందరిని జయించి, వశులను గావించుకొని, దాడి చేయుచుండు వివిధ సాయుధ నాయర్ ముఠాల మద మడచి, కొచ్చిన్వరకుగల తిరువాన్కూరు భూ భాగమునెల్ల సంఘటితపరచి, ఆభ్యుదయపథమున నడచు పరిపాలన మొనర్చెను. చట్టములనుచేసి, జలాశయములను కట్టించి ప్రఖ్యాతిని గాంచెను. ఈ మహారాజు కావించిన అపూర్వమై, చరిత్రాత్మక మైన ఒక మహాకార్యము తిరువాన్కూరు రాజ్యమును శ్రీ అనంతపద్మనాభస్వామికి సమర్పించి, తాను శ్రీ పద్మనాభ దాస యను పేరుతో పరిపాలించుటయై యున్నది. ఈ పదమే ఇప్పటికిని వాడబడుచు నేటి బాలరామవర్మ చిత్రా తిరునాళ్ మహారాజావారి యొక్క బిరుదమై విరాజిల్లుచున్నది.
మార్తాండవర్మచే సంఘటితమైన విస్తృత తిరువాన్కూరు రాజ్యమును అతని మేనల్లుడగు రామవర్మ కార్తిక తిరునాళ్ మరింతదృఢపరచి కర్ణాటకనవాబులతోను, కాలికట్టు సాముద్రీ రాజులతోను తిరునల్వేలి పాళెగార్లతోను యుద్ధమొనర్చి, వారి ఆక్రమణము నుండి రాజ్యమును కాపాడుచు పరిపాలనను సంస్కరించి, ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, శాంతిభద్రతల నెలకొల్పి, అభ్యుదయ పథానువర్తియై సద్యశమును కాంచెను. 'ధర్మరాజు' అను విఖ్యాత నామముతో ప్రజ లతనిని గౌరవించిరి. ఇతని పిదప బాలరామవర్మ పరిపాలనా దక్షత లేనివాడై కుట్రలుపన్ను నీచులగు సలహాదారుల చేతులలో కీలుబొమ్మయై, అపయశస్సును గాంచుటచే, ప్రజలలో సంక్షోభము కలిగినది. వేలుతంపి దళవాయి అని ప్రసిద్ధిగాంచిన ఒక వీరుడు తిరుగుడు పాటుచేసి ప్రధానిగా నేర్పడి, అక్రమపరిపాలనము నంతమొందించెను. ఈస్టు ఇండియా కంపెనీవారికి చెల్లింపబడుచున్న పైకము
29