Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

కేరళదేశము (చరిత్ర)

రాజప్రముఖుడుగా 1 - 11 - 1956 వరకు పాలించెను. కేరళరాష్ట్ర సంస్థాపనతో గవర్నరు ఏర్పడిన తరువాత వీరికి రాజకీయములతో సంబంధములేదు. తమ వంశ మర్యాదలను కాపాడుకొనుచు ఇప్పటికిని వీరు తిరువనంతపుర ములో శ్రీ పద్మనాభస్వామి కైంకర్య మొనర్చుచుందురు.

కొచ్చిన్: తిరువాన్కూరు చరిత్రవలెనే కొచ్చిన్ సంస్థానపు చరిత్రకూడ మరుగువడియుండెను. కొచ్చిన్ సంస్థాన ప్రభువులు 'చేరమాన్ పెరుమాళ్' అను రాజు కాలము నుండి వంశపారంపర్యముగ తమ రాజ్యాధికారమును అనుభవించుచు వచ్చిరి. చేరమాన్ పెరుమాళ్ అను నాతడు తన రాజ్యమును తన బందుగులకును ముఖ్యులయిన రాజవంశీయులకును పంచియిచ్చెను.

1502 వ సంవత్సరములో, పోర్చుగీసువారికి, కొచ్చిన్ సంస్థానముచే, కొచ్చిన్ రేవునకు సమీపమందు గల భూమి దానముచేయబడెను. ఆ ప్రదేశములో మరుసటి సంవత్సర మొక కోటను నిర్మించుకొనుటకును, కొచ్చిన్ సంస్థానముతో వాణిజ్య సంబంధములు నెలకొల్పుకొనుటకును, పోర్చుగీసువారు ప్రభుత్వానుమతిని పొందిరి. 'జా మోరిన్’ అను నాతనితో తలపెట్టిన యుద్ధములలో కొచ్చిన్ ప్రభువు, పోర్చుగీస్ వారినుండి అధికమయిన సాయమును సంపాదించుకొనెను. 17 వ శతాబ్ది ఉత్తర భాగములో పోర్చుగీసువారి ప్రతిభ పశ్చిమ తీరమున తగ్గ నారంభించెను. 1663 వ సంవత్సరములో పోర్చుగీసువారు, డచ్చివారిచే నోడింపబడి కొచ్చిన్ నగరమునుండి వెడలగొట్టబడిరి.

పిదప కొచ్చిన్ ప్రభువు డచ్చివారితో సంధి నొనర్చు కొనెను. పూర్వము పోర్చుగీసువారి కొసగిన హక్కులనే డచ్చివారికి గూడ నొసగెను. దాదాపు ఒక శతాబ్ది పిమ్మట (1759) డచ్చివారి అధికారము సన్నగిల్లెను. అపుడు కాలికట్‌నం దున్న 'జామోరిన్' అను నాతడు కొచ్చిన్ రాజుపై దండెత్తెను. తిరువాన్కూరు రాజు చేసిన గొప్పసహాయముచే జామోరిన్ తరిమి వేయబడెను.

క్రీ. శ. 1776 లో కొచ్చిన్‌పై హైదరాలీ దండెత్తెను. ఆతనికి ఆతని అనంతరము అతని కుమారుడైన టిప్పు సుల్తానునకును కొచ్చిన్ సంస్థానము అనేక దశాబ్దముల వరకును లోబడి యుండెను. క్రీ. శ. 1791 లో కొచ్చిన్ మహారాజు ఈస్ట్ ఇండియా కంపెనీవారితో మిత్రత్వ సంధి యొనర్చుకొనెను. ఆ సంధి ననుసరించి కొచ్చిన్ మహారాజు కంపెనీవారికి తన సంస్థానము లోబడియుండు నట్లును, కంపెనీవారు తన కొసగు రక్షణమునకు ప్రతిఫలముగ ప్రతి సంవత్సరమును వారికి తాను కొంత ధన మర్పించునట్లును, అంగీకరించెను. తదాదిగా కొచ్చిన్ సంస్థానపు మహారాజులందరును తమ సంస్థానమును శాంతి భద్రతాయుతముగ ఏలుకొనగలుగుచుండిరి. తిరువాన్కూరు, కొచ్చిన్ సంస్థానములు రెండును కేరళ రాష్ట్రములో అంతర్భాగము లయ్యెను. అందుచే కొచ్చిన్ మహారాజు తన రాజ్యాధికారమును కోల్పోయెను. (1956)

మలబారుప్రాంతము : కేరళ రాజ్యములో ఉత్తరభాగమందు కాలికట్ నివాసియగు “జామోరిన్" అను నాతనియొక్క పూర్వునకు "పెరుమాళ్" ప్రభువంశములో తుదివానినుండి కొంత భూమియు, ఆ భూమితో పాటు బహుమానముగా వానికొక ఖడ్గమును లభించెను. ఆ ఖడ్గ సహాయమున 'జామోరిన్' పరిసరప్రాంతము లందలి రాజులందరిని లోబరచుకొనగలిగెను.

జామోరిన్ సాగించిన దండయాత్రలలో ఒకొ క్కప్పుడు అతనికి అరబ్బులు సాయపడుచుండిరి. అంతకుపూర్వమే అరబ్బులు కేరళమునకు వచ్చి 'కాలికట్' నగరమును తమ వ్యాపారకేంద్రముగ నేర్పరచుకొనిరి. నావికా నిర్వహణమునందు ఆ రోజులలో అరబ్బులు దిట్టలై యుండిరని ప్రతీతి కలదు. వారి సహకారముతో జామోరిన్ సిసలయిన ఒక నావికాదళమును నిర్మించెను. కేరళ చరిత్రలో ఆ యుగమొక సువర్ణయుగముగా అభివర్ణింప బడినది. ఆ నావికాదళ సహాయముచే పోర్చుగీసు దండయాత్రికులను, సముద్రపు టోడదొంగలను, కేరళతీరమునకు కొంతకాలమువరకు చేరకుండా తరిమివేయ గలిగిరి. 14 వ శతాబ్దిలో విజయనగరపు ప్రభువులు తాత్కాలికముగ జామోరిన్‌ను తమ ఆధీనములోనికి తెచ్చుకొనిరి. కాని 15 వ శతాబ్దాంతమున పోర్చుగీసు నావికుడగు వాస్కోడిగామా అనునాతడు కాలికట్టులో దిగినంతనే, జామోరిన్ మరల మలబారు ప్రభువులందరిలో ప్రబలుడయ్యెను.

అనంతరము మలబారునందు చిన్న చిన్న రాజులనడుమ అంతఃకలహములు చెలరేగెను. పోర్చుగీసువారు ఏదో

31